ఆసియా కప్ 2025 ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. అన్ని జట్లు ఈ టోర్నీ కోసం సమయాత్తమవుతున్నాయి. జట్ల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. భారత సెలెక్షన్ కమిటీ కూడా జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఆగస్ట్ 19న ముంబై వేదికగా జట్టును ప్రకటించే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా మీడియా సమావేశంలో పాల్గొని జట్టు వివరాలను వెల్లడిస్తారని తెలిపాయి. అయితే జట్టు ప్రకటనకు ముందే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
టీమిండియా టీ20 సెన్సేషన్, సిక్సర్ల సింగ్ రింకూ సింగ్ను జట్టు నుంచి తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఫినిషర్గా గుర్తింపు పొందిన రింకూ సింగ్.. గత కొద్ది రోజులుగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్ల్లో 29.43 సగటుతో 206 పరుగులే చేశాడు. అంతేకాకుండా టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆల్రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. జట్టులో బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండాలనే యోచనలో ఉన్నాడు. రింకూ సింగ్ పార్ట్టైమ్ స్పిన్నర్గా రాణించినప్పటికీ.. అతని కంటే మెరుగైన బౌలింగ్ చేసే ఆటగాళ్లవైపు గంభీర్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

బ్యాకప్ వికెట్ కీపర్గా జితేష్ శర్మను తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అతన్నే ఫినిషర్ రోల్లో ఆడించాలనే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్లో ఫినిషర్గా జితేష్ శర్మ దుమ్మురేపాడు. ఆర్సీబీకి సంచలన విజయాలు అందించి.. ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో కేకేఆర్ తరఫున రింకూ సింగ్.. గుజరాత్ టైటాన్స్పై సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఆఖరి ఐదు బంతుల్లో 5 సిక్స్లు బాది చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో టీమిండియా టీ20 సెన్సేషన్గా మారిన రింకూ సింగ్.. ఆ తర్వాత టీమిండియా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఐపీఎల్ 2024 సీజన్తో పాటు ఐపీఎల్ 2025 సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటి వరకు 33 టీ20లు ఆడిన రింకూ సింగ్.. 42 సగటుతో 546 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.