లక్నో: టీమిండియా యువ ప్లేయర్, ఐపీఎల్ సంచలనం రింకూ సింగ్ మరోసారి తన హిట్టింగ్ పవర్ చూపించాడు. ఐపీఎల్ తరహా ఇన్నింగ్స్ను గుర్తు చేస్తూ విధ్వంసకర బ్యాటింగ్తో అదిరిపోయే విజయాన్నందించాడు. సూపర్ ఓవర్లో వరుసగా మూడు సిక్స్లు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో ఆడుతున్న రింకూ సింగ్.. మీరట్ మావెరిక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్లో భాగంగా గురువారం కాశీ రుద్రస్ టీమ్తో జరిగిన మ్యాచ్లో మీరట్ మావెరిక్స్ విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మీరట్ మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేఇంది. కెప్టెన్ మాదవ్ కౌశిక్(87 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్ 15 పరుగులే చేశాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కాశీ రుద్రస్ సరిగ్గా 181 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాశీ రుద్రస్ 16 పరుగులే చేసింది. అనంతరం మీరట్ టీమ్ తరఫున బ్యాటింగ్ చేసిన రింకూ సింగ్.. ప్రత్యర్థి స్పిన్నర్ శివమ్ సింగ్ వేసిన సూపర్ ఓవర్లో వరుసగా మూడు సిక్స్లు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
తొలి బంతిని లాంగాఫ్ దిశగా సిక్స్ బాదిన రింకూ సింగ్.. ఫుల్ టాస్గా వేసిన రెండో బంతిని లెగ్ సైడ్ బౌండరీ బయటకు పంపించాడు. మూడో బంతిని లాంగాఫ్ దిశగా సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహించే రింకూ సింగ్.. ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్స్లు బాది సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో రింకూ సింగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ ఇన్నింగ్స్తోనే టీమిండియా పిలుపు అందుకొని.. ఐర్లాండ్ పర్యటనలో అరంగేట్రం చేశాడు.