IND vs AFG: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పినట్లే బ్యాటింగ్ చేస్తున్నానని యువ ఫినిషర్ రింకూ సింగ్ తెలిపాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో రింకూ సింగ్ (9 బంతుల్లో 2 ఫోర్లతో 16 నాటౌట్) తన ఫినిషర్ పాత్ర పోషించాడు. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన రింకూ సింగ్.. ఇటీవల ధోనీని కలిసిన విషయాన్ని, అతనితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నాడు. 'నెంబర్ 6లో బ్యాటింగ్ చేయడం.. మ్యాచ్లను ముగించడం అలవాటుగా మార్చుకున్నాను. ఈ ఫినిషర్ బాధ్యత పట్ల సంతోషంగా ఉన్నాను.

తీవ్రమైన చలిలో ఆటను ఆస్వాదించాను. ఎముకలు కొరికే చలిలో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. నేను నా అంతరాత్మతో మాట్లాడే ప్రయత్నం చేశాను. నెంబర్ 6లో బ్యాటింగ్ చేయాలి. ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం.. పరుగులు చేసే ఛాన్స్ దక్కదని నాకు నేను చెప్పుకున్నా. ఇటీవలే నేను ధోనీ భాయ్తో మాట్లాడాను.
బంతిని బట్టి ఆడాలని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. నేను అదే చేస్తున్నాను. బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువగా ఆలోచించను. బంతికి తగ్గట్లు మాత్రమే రియాక్ట్ అవుతాను.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 42), అజ్మతుల్లా ఒమర్జాయ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29), ఇబ్రహీమ్ జడ్రాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలుపొందింది. శివమ్ దూబే(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 60 నాటౌట్)కు తోడుగా జితేశ్ శర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31), తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసారు.