టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఎప్పుడూ సీరియస్గా కనిపిస్తాడు. చాలా అరుదుగా అతను ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. అతను నవ్వాడంటే ఆరోజు పెద్ద వార్త అవుతుంది. అంతలా సీరియస్గా కనిపిస్తాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. మైదానంలో ఏం జరిగినా గంభీర్ మాత్రం డగౌట్లో సీరియస్గా ఉంటాడు. ఓ ఇంటర్వ్యూలో అతన్ని ఇదే విషయం గురించి ప్రశ్నిస్తూ.. 'మీకు నవ్వు రాదా?' అని అడిగితే 'అభిమానులు జట్టు విజయం కోసం క్రికెట్ మ్యాచ్లు చూడటానికి డబ్బులు చెల్లిస్తారు. నా చిరునవ్వును చూడటానికి కాదు'అని తనదైన శైలిలో బదులిచ్చాడు.
అయితే ప్రపంచానికి గంభీర్ కోపంగా కనిపించినా.. అతనిలోనూ హాస్య చతురత ఉందని టీమిండియా టీ20 సెన్సేషన్ రింకూ సింగ్ తెలిపాడు. డ్రెస్సింగ్ లోపల ఆటగాళ్లతో గంభీర్ చాలా సరదాగా ఉంటాడని, నవ్వుతూ గడుపుతాడని చెప్పుకొచ్చాడు. గంభీర్లో ఈ కోణం ఉందని బయట వాళ్లకు తెలియదన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రింకూ సింగ్ ఈ విషయాలు పంచుకున్నాడు.

'కేకేఆర్ తరఫున ఆడుతున్నప్పుడు గౌతం గంభీర్ను దగ్గరగా చూశాను. అతను ప్రతీ ఆటగాడికి అండగా నిలుస్తాడు. మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించేవాడు. అభిమానులు గంభీర్ సీరియస్గా ఉండటాన్ని మాత్రమే చూశారు. గంభీర్ ఎప్పుడూ విజయం సాధించాలనుకుంటున్నాడు. ప్రతీ మ్యాచ్కు ముందు అతను దేవుడిని ప్రార్థిస్తాడు. అదే విధంగా గంభీర్ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. లాంజ్లో ఉన్నప్పుడు పాటలు వింటాడు.
మా టీమ్లో రమణ్దీప్ సింగ్ డీజేలా వ్యవహరించేవాడు. గంభీర్ అందరితో సరదాగా ఉండేవాడు. సీనియర్ ఆటగాళ్లతో నవ్వుతూ జోక్స్ కూడా వేసేవాడు.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. కేకేఆర్కు మెంటార్గా వ్యవహరించిన గంభీర్.. ఆ జట్టుకు టైటిల్ అందించి తప్పుకున్నాడు. ఆ విజయంతో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆరంభంలో కాస్త తడబడినా.. ఇప్పుడు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాడు.