టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కకకపోవడంపై అతని తండ్రి ఖాన్చంద్ర సింగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచకప్ జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కలేదన్న వార్తతో తమ గుండె బద్దలైందని తెలిపారు.
స్థానిక ఛానెల్తో మాట్లాడిన ఆయన.. రింకూ సింగ్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంటాడని భావించి సంబరాలు చేసుకునేందుకు స్వీట్లు, క్రాకర్స్ తెచ్చిపెట్టుకున్నామని చెప్పారు. తీరా ప్రపంచకప్కు ఎంపిక చేసిన జట్టులో తాను లేనని రింకూ సింగ్ తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు.

సంబరాలు చేసుకోవాలనుకున్నాం..
'రింకూ సింగ్ ప్రపంచకప్కు ఎంపికవుతాడనే నమ్మకం మాకు ఉండింది. సంబరాలు చేసుకునేందుకు స్వీట్లు, టపాసులు కూడా తెచ్చుకున్నాం. రింకూ ప్రపంచకప్కు ఎంపికవ్వడమే కాకుండా తుది జట్టులో కూడా ఉంటాడని ఆశించాం. కానీ మా దురదృష్టం కొద్ది అలా జరగలేదు. ఈ వార్తతో మా గుండె బద్దలైంది.
రింకూ సింగ్ తన తల్లికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. 15 మంది జాబితాలో లేకపోయినా జట్టుతోనే వెళ్తానని చెప్పాడు. 'అని రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ర్ సింగ్ చెప్పుకొచ్చారు. కొడుకు స్టార్ ప్లేయర్ అయినా.. ఖాన్ చంద్ర సింగ్.. తాను చేసే గ్యాస్ సిలిండర్ల డెలివరీ పనిని మానలేదు.

స్టాండ్బై ప్లేయర్గా..
అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గతేడాదిగా భారత టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు అసాధారణ ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్ను సెలెక్టర్లు స్టాండ్బై ఆటగాడిగా ఎంపిక చేశారు.
అయితే ఐపీఎల్ 2024 సీజన్ ప్రదర్శనే రింకూ సింగ్ను పక్కనపెట్టడానికి కారణమైనట్లు అర్థమవుతోంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ తరఫున రింకూ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన రింకూ సింగ్.. 150 స్ట్రైక్రేట్తో 123 పరుగులే చేశాడు. ఈ గణంకాలతోనే రింకూ సింగ్ను పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది.
శివమ్ దూబే కోసం..
అంతేకాకుండా శివమ్ దూబే సూపర్ ప్రదర్శన కూడా రింకూ సింగ్ ఎంపికను అడ్డుకున్నట్లు అర్థమవుతోంది. సీఎస్కే తరఫున ఫినిషర్గా ఆడుతున్న దూబే సంచలన బ్యాటింగ్తో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే రింకూ సింగ్ కంటే బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన శివమ్ దూబేనే సెలెక్టర్లు సరైన ఫినిషర్గా భావించి ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది.
రింకూ సింగ్ను ఎంపికచేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబటి రాయుడు, ఆకాశ్ చోప్రా, సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి ఆటగాళ్లు సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.