టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్ను మూశారు. గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో రింకూ సింగ్ భారత జట్టును వీడి హుటాహుటిన సొంతూరుకు బయలుదేరాడు. ఖచంద్ర సింగ్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన నాలుగో దశ కాలేయ క్యాన్సర్తో పోరాడుతున్నారు.
తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసి 3 రోజుల కిందటే రింకూ సింగ్ తన స్వగ్రామానికి వెళ్లారు. గురువారం మ్యాచ్ సమయానికి మళ్లీ తిరిగి జట్టుతో చేరినా తుది జట్టులో చోటు దక్కలేదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్ను ఓపెనర్గా ఆడించడంతో రింకూ సింగ్ ఉద్వాసనకు గురయ్యాడు. వెస్టిండీస్తో మ్యాచ్కు కూడా రింకూ సింగ్ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ విషాద సమయంలో రింకూ సింగ్కు సహచర ఆటగాళ్లు, అభిమానులు, మాజీ క్రికెటర్లు సంఘీభావం తెలుపుతూ పోస్ట్లు పెడుతున్నారు.

రింకూ సింగ్ చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. కోల్కతా నైట్రైడర్స్ తరఫున సంచలన ప్రదర్శనతో స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. రింకూ సింగ్ తండ్రి గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేసే పని చేసేవారు. కొడుకు స్టార్ క్రికెటర్గా ఎదిగినా ఆయన తన పనిని కొనసాగించారు. సమాజ్వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో రింకూ సింగ్కు నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే.
అయితే రింకూ సింగ్ బిజీగా ఉండటంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అయితే కొడుకు పెళ్లి చూడకుండానే ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. రింకూ సింగ్కు తన తండ్రి అంటే చాలా ఇష్టం. కెరీర్ ప్రారంభంలోనే తన తండ్రికి ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చాడు.