టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా తాను పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. రింకూ సింగ్ సరదాగా చేసిన ఈ పని అతన్ని అనవసర వివాదాంలోకి నెట్టింది. ఈ వీడియో హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా ఉందని కర్ణి సేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇది సనాతన ధర్మాన్ని కించపరచడమేనని ఆరోపించింది. వెంటనే రింకూ సింగ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా రింకూ సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదు చేయకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించింది.
రింకూ సింగ్ ఫేస్బుక్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఓవైపు అతను సిక్సర్లు బాదుతుండగా.. మరోవైపు హిందూ దేవుళ్లు అయిన హనుమంతుడు, శివుడు, విష్ణువు, వినాయకుడు థార్ కార్లో ప్రయాణిస్తున్నట్లుగా ఉంది. ఏఐ సాయంతో జనరేట్ చేసిన ఈ వీడియోలో హనుమంతుడు థార్ కారు డ్రైవ్ చేస్తుండగా.. శివుడు, విష్ణువు, వినాయకుడు వెనుక సీట్లో కూర్చొని ఉన్నారు. దేవుళ్లంతా సన్గ్లాసెస్ పెట్టుకొని మోడర్న్గా కనిపించారు. బ్యాక్రౌండ్లో ఇంగ్లీష్ పాట వస్తుండగా.. దేవుళ్లు ఆస్వాదిస్తున్నట్లుగా ఉంది.

ఈ వీడియోకు రింకూ సింగ్.. 'నిన్ను క్రికెటర్గా ఎవరు చేశారో తెలుసా?'అనే క్యాప్షన్ ఇచ్చాడు. దేవుళ్ల దయతోనే తాను క్రికెటర్గా ఎదిగాననే ఉద్దేశంతో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. కానీ ఈ వీడియో మిస్ఫైర్ అయ్యింది. హిందూ దేవుళ్లను ఆధునిక వేషధారణలో సన్గ్లాసెస్తో కారులో షికారు చేస్తున్నట్లు చూపించడం సనాతన ధర్మాన్ని అవమానించడమేనని కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడింది. రింకూ సింగ్ క్షమాపణలు చెప్పాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరింది.
రింకూ సింగ్ హిందూ దేవుళ్లను అవమానించాడని కర్ణిసేన అధ్యక్షుడు సుమిత్ తోమర్ ఆరోపించాడు. 'రింకూ సింగ్.. ఐపీఎల్లో షారూఖ్ ఖాన్కు చెందిన కేకేఆర్ జట్టులో సభ్యుడు. షారుఖ్ లాగే రింకూ సింగ్ కూడా తన మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడు. హిందూ దేవుళ్లకు సన్గ్లాసెస్ పెట్టి, థార్ కారు నడుపుతూ.. ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడం అంటే హిందువుల మనోభావాలతో ఆడుకోవడమే'అని మండిపడ్డాడు.
ప్రస్తుతం రింకూ సింగ్.. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం సన్నదమవుతున్నాడు. బుధవారం నాగ్పూర్ వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరీస్కు తెరలేవనుంది. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో ఓటమిపాలైన భారత్.. టీ20 సిరీస్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్ గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలనుకుంటుంది.