టీమిండియా నయా ఫినిషర్, టీ20 సెన్సేషన్ రింకూ సింగ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమయ్యాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్తో రింకూ సింగ్ వివాహ నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్లు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
కానీ జర్నలిస్ట్లు, క్రికెట్ పీఆర్స్ సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలియజేయడంతో నిశ్చితార్థ విషయం బయటకు వచ్చింది. అయితే తమ నిశ్చితార్థ విషయాన్ని రింకూ సింగ్-ప్రియా సరోజ్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మరోవైపు నిశ్చితార్థ వార్తలను ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ ఖండించారు. రింకూ సింగ్ కుటుంబం పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చిందని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఎవరీ ప్రియా సరోజ్..?
ప్రియా సరోజ్ ఇటీవలే మచ్లిషహర్ లోకసభ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 25 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన సభ్యురాలిగా ఆమె రికార్డ్ సాధించారు.
ఆమె ఢిల్లీ వర్సిటీలో చదివి సుప్రీం కోర్టు లాయర్గా పనిచేశారు. ప్రియా సరోజ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ మచ్లిషహర్ నియోజకవర్గం నుంచే వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. 1999, 2004, 2009లో ఆయన విజయం సాధించారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ప్రియా సరోజ్ కొనసాగించారు. బీజేపీ సీనియర్ లీడర్ బీపీ సరోజ్పై ఆమె విజయం సాధించారు.
మరోవైపు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్.. అసాధారణ ప్రదర్శనతో స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున సంచలన ప్రదర్శన కనబర్చడంతో అతనికి టీమిండియాలో చోటు దక్కింది. గత రెండేళ్లుగా అతను టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తనదైన బ్యాటింగ్తో నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రింకూ సింగ్.. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. జనవరి 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.