జట్టులో నిలకడగా అవకాశాలు రాకపోవడంతో తాను ఒత్తిడికి గురవుతున్నానని టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్ అన్నాడు. ప్రతీసారి తనను తాను నిరూపించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుసగా అవకాశాలు ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తానని పరోక్షంగా వెల్లడించాడు. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రింకూ సింగ్(44 నాటౌట్) ఫినిషర్గా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్ గెలవడమే తమ లక్ష్యమని చెప్పాడు. 'నేను జట్టులోకి వస్తూ పోతూ ఉండటంతో నాపై కొంత ఒత్తిడి ఉంది. నాకు అవకాశం దక్కిన ప్రతీసారి నన్ను నేను నిరూపించుకోవాల్సి వస్తుంది. సింగిల్స్, డబుల్స్ తీస్తూ మధ్య మధ్యలో బౌండరీలు కొట్టాలనేదే నా బ్యాటింగ్ ప్రణాళిక. అలాగే ఆఖరి వరకు ఉండి మ్యాచ్ను ముగించాలని అనుకున్నాను. అదే చేశాను. ఇంటెంట్ కొనసాగించాలని గంభీర్ సర్ నాకు చెప్పారు.
ఫ్లడ్ లైట్స్ కారణంగా క్యాచ్ చేజారలేదు. నా తప్పిదం వల్లే చేజారింది. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ మాకు చాలా కీలకం. ఇందులో విజయం సాధించాలనుకుంటున్నాం. ఈ ఆత్మవిశ్వాసాన్ని, ఊపును వరల్డ్ కప్ వరకు తీసుకెళ్లి అక్కడ కూడా విజయం సాధించాలన్నదే మా లక్ష్యం.

నేను అర్ష్దీప్ సింగ్తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సింగిల్స్ తీయాలని ప్లాన్ చేసుకున్నాం. ఆపై చివరి ఓవర్ను నేను ఆడుతానని అతనికి చెప్పాను. 5,6, 7 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చినప్పుడు నా మైండ్ సెట్ ఇలానే ఉంటుంది. అర్ష్దీప్ సింగ్ డాట్ బాల్స్ ఆడినప్పుడు నేను ఏం అనలేదు. కదలకుండా క్రీజులో ఉండి సింగిల్ తీసి ఇవ్వమని చెప్పాను. కొన్నిసార్లు డాట్ బాల్స్ వస్తుంటాయి. చివరి రెండు బంతుల్లో బంతిని బలంగా బాదమని చెప్పాను. అతను బౌండరీ కూడా కొట్టాడు. 'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్తో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 32), రింకూ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(2/27), కైల్ జెమీసన్(2/54) రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులే చేసి ఓటమిపాలైంది. గ్లేన్ ఫిలిప్స్(40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 78) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/37), శివమ్ దూబే(2/28) రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరగనుంది.