
టెస్ట్ క్రికెట్లో ఇవి సరిపోవు..
ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పాంటింగ్.. బ్యాటింగ్ వైఫల్యమే ఆసీస్ ఓటమికి కారణమన్నాడు.‘అడిలైడ్లో ఆస్ట్రేలియా 191 పరుగులే చేసింది. మెల్బోర్న్ 195, 200 పరుగులకే పరిమితమైంది. ఇది టెస్టు క్రికెట్.. ఈ పరుగులు ఏమాత్రం సరిపోవు. అందులోనూ ఆ మాత్రం రన్స్ చేసేందుకు వారెంత సమయం తీసుకుంటున్నారనేదే కూడా బాధాకరం.

భయాన్ని వీడాలి..
ఆటగాళ్లు మరింత తీవ్రత చూపించాలి. ఔటవుతామనే భయాన్ని వీడాలి. క్రీజులోకి వెళ్లి బ్యాటుతో పరుగులు చేయాలి. ఓవర్కు రెండున్నర కన్నా ఎక్కువ పరుగులు చేయాలి. అడిలైడ్, మెల్బోర్న్లో ఆసీస్ బ్యాట్స్మెన్ ఓవర్కు రెండున్నర పరుగుల చొప్పున చేశారు. ఓడిపోయిన గత సిరీసులోనూ అంతే. టెస్ట్ క్రికెట్లో లాంగ్ ఇన్నింగ్స్లో ఆడటం ముఖ్యం. ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టాలి' అని పాంటింగ్ పేర్కొన్నాడు.

స్మిత్, లబుషేన్ రాణించాలి..
ఆసీస్ బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారో ఒకసారి చూసుకోవాలని పాంటింగ్ హితవు పలికాడు. 'టెస్టులంటేనే భాగస్వామ్యాలు. ఈ రెండు మ్యాచుల్లోనూ అలాంటివేమీ లేవు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ ఫామ్లో లేడు. వార్నర్ అందుబాటులో లేడు. లుబుషేన్ 40కి పైగా స్కోరు చేస్తున్నా భారీ స్కోర్లుగా మలచడం లేదు. వార్నర్ త్వరగా జట్టులో చేరాలి. స్మిత్ పరుగులు చేయడం ఆరంభించాలి. గత వేసవిలోని ఫామ్ను లబుషేన్ అందుకోవాలి. ఆసీస్కు వీరంతా రాణించడం అవసరం' అని పాంటింగ్ అన్నాడు. వార్నర్, స్మిత్ లేకుంటే ఎలా ఉంటుందో గత పర్యటన ఫలితంతో తెలుసొచ్చిందన్నాడు.

అద్భుత విజయం..
ఓవర్నైట్ స్కోరు 133/6తో మంగళవారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలవగా, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. శుబ్మన్ గిల్ (36 బంతుల్లో 35 నాటౌట్; 7 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అజింక్య రహానే (40 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) రెండో వికెట్కు 51 పరుగులు జోడించి జట్టును విజయతీరం చేర్చారు.


Click it and Unblock the Notifications
