టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియాను ఓడించాలంటే ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా స్వేచ్చగా ఆడాలని సౌతాఫ్రికా క్రికెటర్లకు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ సూచించాడు. మరికొద్ది గంటల్లో బార్బోడస్ వేదికగా ప్రారంభమయ్యే ఈ మెగా ఫైనల్లో టీమిండియా, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది.
ఇరు జట్లు సంచలన ప్రద్శనతో ఓటమెరుగని టీమ్స్గా ఫైనల్కు అర్హత సాధించాయి. ఓవైపు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికా విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన 32 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా ప్రపంచకప్ ఫైనల్కు అర్హత సాధించింది.

ఈ క్రమంలోనే సౌతాఫ్రికా ఆటగాళ్లకు రికీ పాంటింగ్ కీలక సూచనలు చేశాడు. 'ప్రపంచకప్ ఫైనల్ చేరిన ప్రతీ టీమ్.. ఇతర మ్యాచ్ల్లానే ఈ మ్యాచ్ కూడా అని చెబుతుంటారు. పెద్ద వేడుక కాదనే విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఏ మాత్రం సరికాదు. ఫైనల్ ఆడుతున్నామనే ఉత్సాహం ప్రదర్శించాలి. సౌతాఫ్రికా ఆటగాళ్లకు గతంలో ప్రపంచకప్ ఫైనల్ ఆడిన అనుభవం లేదు. కాబట్టి ఈ రాత్రిని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలి. ప్రిపరేషన్స్, ఆటలో ఏ మాత్రం తేడా లేకుండా ఆడాలి.
ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా సౌతాఫ్రికా ఓడిపోలేదు. కాబట్టి వాళ్లు తమ ఆటలో పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొత్త ప్రయత్నించాల్సిన పని కూడా లేదు. కేవలం తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేయాలి. జట్టుగా సమష్టిగా రాణించేందుకు కృష్టి చేయాలి. ఇలా చేస్తే టీమిండియాపై ఘన విజయం సాధించగలరు.'అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.