ఇందుకే పట్టుబట్టి శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేశా: రికీ పాంటింగ్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రేయస్ అయ్యర్ అసాధారణమైన కెప్టెన్ అని, ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదించే సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 265 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త చరిత్రను లిఖించింది.
శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఓటమెరుగని జట్టుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాంటింగ్.. ఇలా ఆడగలడనే శ్రేయస్ అయ్యర్ను పట్టుబట్టి వేలంలో కొనుగోలు చేశానని వెల్లడించాడు.

'శ్రేయస్ అయ్యర్ చాలా మంచి వ్యక్తి. వేలంలో అతని కోసం అంతగా ప్రయత్నించడానికి ఇది ఒక కారణం. ఈ జట్టును పునర్నిర్మించే క్రమంలో అతను మాకు గొప్ప నాయకుడవుతాడని నాకు తెలుసు. రన్ ఛేజ్లో అతను చివరి వరకు ఉంటే.. మేం విజయం సాధిస్తాం. ఈ రాత్రి (ఢిల్లీతో మ్యాచ్లో) కూడా, 11- 12వ ఓవర్ల సమయంలో నేను అతని దగ్గరకు వెళ్లి ఇదే చెప్పాను. చివరి వరకు క్రీజులో ఉంటే ఈ మ్యాచ్ గెలుస్తామన్నాను. అతను మళ్లీ అదే చేసి చూపించాడు. అయ్యర్కే కాదు.. అతన్ని నమ్మిన వారందరికీ ఈ ఘనత దక్కాలి’అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్(152 నాటౌట్), నితీష్ రాణా(91) విధ్వంసకర బ్యాటింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ 264/2 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయినా పంజాబ్ కింగ్స్ ఎలాంటి ఆందోళనకు గురికాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కొట్టినప్పుడు మనం కొట్టలేమా? అని పంజాబ్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఈ విషయాన్ని అయ్యరే మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఓపెనర్లు విధ్వంసకర ఆరంభం అందిస్తే.. ఆ జోరును తాము కొనసాగించామని చెప్పాడు.
ఇక ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. 28, 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అయ్యర్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్లను కరుణ్ నాయర్ జారవిడిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications