టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అత్యుత్తమ సారథుల్లో రోహిత్ శర్మ ఒకరని కొనియాడాడు. ఓ జాతీయ స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహించిన ఇంటరాక్షన్లో పాల్గొన్న రికీ పాంటింగ్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్తో ఆడుతున్నప్పటి నుంచి తనకు రోహిత్ శర్మ తెలుసని, కెప్టెన్సీ కోసం అతని పేరు సూచించిందే తానని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. 'ముంబై ఇండియన్స్కు ఆడినప్పటి నుంచి నాకు రోహిత్ శర్మ తెలుసు. కెప్టెన్గా తన పేరును నేనే సూచించాను.

ఆటగాడిగా.. కెప్టెన్గా రోహిత్ అద్భుతం. కెప్టెన్సీ అనేది మైదానంలో కంటే తెరవెనుకే ముఖ్యం. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటను బయటకి తీసుకురావాలి. ఆటగాళ్లతో ఎంత సేపు గడుపుతావు..? వారి సమస్యలను ఎలా తీసుకుంటావు? వారి నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబడుతావనేదే కెప్టెన్ చేయాల్సిన అతి ముఖ్యమైన పని.
ఈ విషయంలో రోహిత్ శర్మ అత్యుత్తమం. తమ ఆటగాళ్ల పట్ల రోహిత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే రోహిత్ గ్రేటెస్ట్ కెప్టెన్ అని చెబుతున్నా'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత రికీ పాంటింగ్ ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అతను సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోగా.. రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఆ సీజన్లోనే అత్యుత్తమ కెప్టెన్సీతో జట్టుకు తొలి టైటిల్ అందించాడు.
ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలోనూ ముంబై ఇండియన్స్ను రోహిత్ విజేతగా నిలబెట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్ వరకు ముంబై జట్టును నడిపించిన రోహిత్ శర్మ మొత్తం 163 మ్యాచ్ల్లో 91 విజయాలు అందించాడు. రోహిత్ సారథ్యంలో 68 పరాజయాలు ఎదుర్కొన్న ముంబై.. 4 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.
ముంబై ఇండియన్స్ సారథిగా సక్సెస్ కావడంతోనే రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అతని సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 సాధించింది.