
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు అరుదైన గౌరవం దక్కింది. ఘోర రోడ్డు ప్రమాదంతో ఆటకు దూరమైన రిషభ్ పంత్ జెర్సీ నెంబర్తో ఐపీఎల్ 2023 సీజన్ బరిలోకి దిగాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ దృవీకరించాడు. తమ జట్టు రిషభ్ పంత్ను ఎంతో మిస్సవుతుందని చెప్పిన పాంటింగ్.. అతని జెర్సీ నెంబర్ను మా టీషర్టులుపై లేదా క్యాప్లపై ముద్రించుకోవాలనుకుంటున్నామని తెలిపాడు.
'మేం రిషభ్ పంత్ను చాలా మిస్ అవుతున్నాం. ప్రతీ మ్యాచ్కు పంత్ డగౌట్లో నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మాకు అనుకూలంగా ఉన్న మార్గాల్లో అతన్ని జట్టులో భాగం చేయాలనుకుంటున్నాం. మేం అతని జెర్సీ నంబర్ను మా టీషర్టులపై లేదా క్యాప్లపై ముద్రించుకోవాలని నిర్ణయించుకున్నాం.
పంత్ మా జట్టుతో లేకపోయినా, ఎప్పటికీ అతనే మా సారథని తెలియజేయడం కోసమే ఈ పని చేయాలనుకుంటున్నాం. మేం ఇంకా పంత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది నిర్ణయించుకోలేదు. అయితే సర్ఫరాజ్ ఖాన్ మాత్రం మా జట్టుతో కలిసాడు. ఈ ఏడాది సీజన్కు ముందు మేం ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలి అనుకుంటున్నాం" అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
డిసెంబర్ 30న రిషభ్ పంత్ సొంతంగా డ్రైవ్ చేస్తున్న కారు ఢిల్లీ సమీపంలో రూర్కీ ప్రాంతంలో డివైడర్ను ఢీకొట్టి పూర్తిగా దగ్దమైన విషయం తెలిసిందే. ఓ బస్ డ్రైవర్, కండక్టర్ సాయంతో ప్రాణాలతో బయటపడిన రిషభ్ పంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఇంటి దగ్గరే ఉంటూ.. గాయాల నుంచి కోలుకుంటున్నాడు. గాయాల తీవ్రత కారణంగా అతను సుమారు రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్ ఆడకపోయినా.. డగౌట్లో భాగం కావాలని ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్ కోరుతోంది. అయితే అతను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. వారు అనుమతిస్తే ఢిల్లీ ఫ్రాంచైజీ మ్యాచ్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి.