టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాపై పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోచ్గా తాను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో పృథ్వీ షా ఒకడని కొనియాడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షా అన్సోల్డ్గా నిలవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరిగిన మెగా వేలంలో రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న పృథ్వీ షాను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. దాంతో అతను అన్సోల్డ్గా నిలిచాడు. ఫామ్లో లేకపోవడం.. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో పృథ్వీ షాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అంతేకాకుండా అతని క్రమశిక్షణరాహిత్యం కూడా వేలంలో అన్సోల్డ్ నిలవడానికి కారణమైంది.

2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. ఏడేళ్ల పాటు ఆ జట్టులోనే కొనసాగాడు. నిలకడలేమి ఫామ్తో సతమతమైనా అతనికి ఢిల్లీ క్యాపిటల్స్ అండగా నిలిచింది. కానీ తాజా సీజన్లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పృథ్వీ షాను బేస్ ప్రైజ్కు కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు.
పృథ్వీ షా అన్సోల్డ్గా నిలవడంపై రికీ పాంటింగ్ విచారం వ్యక్తం చేశాడు. గడ్డు పరిస్థితులను ధాటుకొని అతను కచ్చితంగా పుంజుకుంటాడని చెప్పాడు. 'ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ షా అమ్ముడుపోకపోవడం చాలా బాధాకరం. నా కోచింగ్ కెరీర్లో ఇప్పటి వరకు నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో పృథ్వీ షా ఒకడు. కనీసం అతను చివరి రౌండ్లోనైనా అమ్ముడుపోతాడని భావించాను. కానీ అలా జరగలేదు.
వేలంలో అన్సోల్డ్గా మిగిలినప్పటికీ.. ఫ్రాంచైజీల కళ్లు అన్నీ అతడిపైనే ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక్క విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడితే అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడుతాయి. గడ్డు పరిస్థితులకు ధాటుకొని పృథ్వీ షా కచ్చితంగా తిరిగి వస్తాడు.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
పృథ్వీ షాతో రికీ పాంటింగ్ మంచి సంబంధం ఉంది. ఐపీఎల్ 2018 నుంచి 2024 వరకు పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే పాంటింగ్ పంజాబ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతను కూడా పృథ్వీ షా కోసం బిడ్ వేయలేదు.