లండన్: ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో వరుస పరాజయాలతో చతికిలపడిన ఇంగ్లండ్ విజయాల బాట పట్టాలంటే తుది జట్టులో కీలక మార్పులు చేయాల్సిందేనని క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఒక్క వికెట్ తేడాతో ఓడిన ఇంగ్లండ్.. రెండో టెస్ట్లో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ రెండు విజయాలతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ గెలవాలంటే ఇంగ్లండ్ చివరి మూడు మ్యాచ్లు గెలవాల్సిందే.

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుంది. ఇక లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్లో ఇంగ్లండ్ కచ్చితంగా స్పిన్నర్తో బరిలోకి దిగాలని పాంటింగ్ సూచించాడు. రాబిన్సన్, జేమ్స్ అండర్సన్లలో ఒకరిపై వేటు వేయాల్సిందేనని చెప్పాడు. ఐసీసీ రివ్యూలో మాట్లాడిన పాంటింగ్ ఇరు జట్ల మార్పులను చర్చించాడు.
'రాబిన్సన్, అండర్సన్ల్లో ఒకరిని పక్కకు పెట్టాల్సిందే. ముఖ్యంగా హెడింగ్లీ వికెట్పై స్పిన్నర్తో బరిలోకి దిగాల్సిందే. నాకు తెలిసి టంగ్ను కొనసాగించి రాబిన్సన్, అండర్సన్లో ఒకరిని పక్కనపెట్టే అవకాశం ఉంది. ఈ ఇద్దరి విషయంలో ఇంగ్లండ్ కీలక నిర్ణయం తీసుకోవాల్సిందే.
అలాగే మార్క్ వుడ్ ఫిట్ అయితే అతన్ని జట్టులోకి తీసుకోవాలి. అతను జట్టులోకి వస్తే టీమ్ బౌలింగ్లో ఫైర్ పవర్ పెరుగుతోంది. ముఖ్యంగా చివరి మూడు మ్యాచ్ల్లో ఆ జట్టు గెలవాల్సిన పరిస్థితుల్లో మార్క్ వుడ్ జట్టుతో చేరడం చాలా కీలకం.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఆసీస్.. గాయంతో దూరమైన నాథన్ లయన్ స్థానంలో టాడ్ మర్ఫీని ఆడించాలని పాంటింగ్ సూచించాడు. 'నాథన్ లయన్కు టాడ్ మర్ఫీ సరైన రిప్లేస్మెంట్. నాథన్ లయన్ దూరమవ్వడం ఆస్ట్రేలియాకు తీరని లోటే. ముఖ్యంగా ఐదో రోజు నాథన్ లేని లోటు ఆసీస్కు స్పష్టంగా తెలిసోస్తోంది. ముఖ్యంగా లెఫ్టాండర్స్ ఉన్న ఇంగ్లండ్ను నాథన్లా మరెవరూ ఇబ్బంది పెట్టలేరు'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఈ రెండు టెస్ట్ల్లో ఇంగ్లండ్ చేజేతులా ఓటమిపాలైంది. బజ్బాల్ పేరిట వేగంగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.