న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ కాంబినేషన్ విషయంలో రోహిత్ సేన ఘోర తప్పిదం చేసిందన్నాడు.
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీసుకోకుండా బరిలోకి దిగడం సరైన నిర్ణయం కాదన్నాడు. టీమిండియా ట్రాప్లో పడిపోయిందంటూ విమర్శలు గుప్పించాడు. బుధవారం ప్రారంభమైన ఈ మెగా మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

పిచ్ కండిషన్స్ పేస్కు అనుకూలంగా ఉండటంతోనే ఎక్స్ట్రా పేసర్ను తీసుకున్నామని చెప్పిన రోహిత్.. తప్పని పరిస్థితుల్లో రవిచంద్రన్ అశ్విన్ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. ఏకైక స్పిన్నర్గా రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్న టీమిండియా.. మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలతో పాటు ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లను ఎంచుకుంది.
ఇక ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్.. టీమిండియా నిర్ణయాన్ని తప్పుబట్టాడు. తొలి ఇన్నింగ్స్ కోసం టీమిండియా తుది జట్టును ఎంపిక చేసినట్లుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'టీమిండియా పేస్ ట్రాప్లో పడిపోయింది. తొలి ఇన్నింగ్స్లో మాత్రమే ఉపయోగపడే పేస్ అటాక్ కోసం కీలక బౌలర్ను పక్కనపెట్టింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను పక్కనపెట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది.
ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ యూనిట్లో నలుగురు లెఫ్టాండర్స్ ఉన్నారని తెలిసి కూడా అశ్విన్ విస్మరించడం షాక్కు గురి చేసింది. రవీంద్ర జడేజా కంటే అశ్విన్ మెరుగ్గా బౌలింగ్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఉమేశ్ యాదవ్కు బదులు శార్దూల్ ఠాకూర్తో బరిలోకి దిగుతారనుకున్నా. ఎందుకంటే ప్రధాన పేసర్లు మహమ్మద్ షమీ, సిరాజ్లు బ్రేక్ ఇవ్వడానికి ఉపయోగపడేవాడు. గేమ్ను ముందుకు తీసుకెళ్లేందుకు జడేజా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసేవాడు. కానీ అశ్విన్ను పక్కనపెట్టి రోహిత్ తప్పిదం చేశాడు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ అశ్విన్ కీలకమయ్యేవాడు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
అయితే చివరి రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉండటంతోనే రోహిత్ శర్మ.. అశ్విన్ను పక్కనపెట్టాడని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఉస్మాన్ ఖవాజా(0)ను సిరాజ్ డకౌట్ చేయగా.. లంచ్ బ్రేక్కు ముందు డేవిడ్ వార్నర్(43)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు. రెండో సెషన్ ఆరంభంలోనే లబుషేన్(26)ను మహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఆసీస్ 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడుతున్నారు. 41 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్లకు 149 పరుగులు చేసింది. మైదానంలో ప్రస్తుతం ఎండ కొడుతుండటంతో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది.