
సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టలేరు?
ముఖ్యంగా ఐపీఎల్లో దుమ్మురేపిన రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి యువకులకు అవకాశాలివ్వాలని పలువురు అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై 'ది గ్రేడ్ క్రికెటర్' అనే కార్యక్రమంలో మాట్లాడిన రికీ పాంటింగ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 'భారత జట్టులో ఇప్పటికే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరికొంత మందిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా ముఖ్యమైన ఆటగాడే. అయినా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను పక్కనపెట్టలేరు.

టాలెంట్ ఎక్కువైంది..
మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా జట్టులో ఉన్నాడు. ఒకవేళ అతను బౌలింగ్ చేయకపోతే ఆ స్థానంలో యువ ఆటగాళ్లను ఉపయోగించుకోవచ్చు. టీమిండియాలో నైపుణ్యమున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని గుర్తుంచుకోవాలి. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఆడలేనప్పుడు వారిని తప్పించాలని అనుకుంటారు. వారికి చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నందునే ఇలాంటి మాటలు వినిపిస్తాయి' అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

కోచ్గా ద్రవిడ్ ఉండటం..
టీమిండియా హెడ్ కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ చేపట్టడం ఆశ్చర్యం కలిగించిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు.'భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ అంగీకరించడం ఆశ్చర్యానికి గురి చేసింది. భారత అండర్-19 కోచ్గా అతను ఎంత ఆనందంగా ఉండేవాడో నాకు తెలుసు. అతని కుటుంబం గురించి తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారని అనుకుంటున్నా. అయినా అతను కోచ్ పదవి చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది. తమకు సరైన వ్యక్తి దొరికాడని కొందరు చెప్పడాన్ని బట్టి.. పదవి చేపట్టేలా వారు ద్రవిడ్ను ఒప్పించివుండొచ్చు'' అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

నావల్ల కాదన్నా..
టీమిండియా చీఫ్ కోచ్గా ఉండాలని తనను సంప్రదించారని కానీ తాను అంగీకరించలేదని పాంటింగ్ తెలిపాడు. ''టీమిండియా ప్రధాన కోచ్ ప్రతిపాదనతో నా వద్దకు కొందరు వచ్చారు. ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నించారు. అంత సమయం కేటాయించలేనని వారితో చెప్పాను'' అని పాంటింగ్ అన్నాడు. టీమిండియా కోచ్ గా ఉండటం మాములు విషయం కాదని.. 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని పాంటింగ్ అన్నారు. అతను ఏ జాతీయ జట్టుకు కోచ్గా ఉండకపోవడానికి ఇదే కారణం.


Click it and Unblock the Notifications












