ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారీ ఫ్రైజ్మనీతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. మార్క్యూ జాబితాలోని ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను రూ. 26.75 కోట్ల రికార్డ్ ధరకు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్.. అర్ష్దీప్ సింగ్ను ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా రూ. 18 కోట్లకు దక్కించుకుంది. వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.
పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా రికీ పాంటింగ్ బాధ్యతలు చేపట్టడంతో ఆ జట్టులోకి రిషభ్ పంత్ వెళ్తాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా పంజాబ్.. శ్రేయస్ అయ్యర్ కోసం బిడ్ వేసింది. రిషభ్ పంత్ను పట్టించుకోలేదు. మెగా ఆక్షన్ బ్రేక్ సమయంలో మీడియాతో మాట్లాడిన పాంటింగ్ను ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు.

రిషభ్ పంత్ను తాము తీసుకోవాలని భావించలేదని, అతని కోసం తీవ్ర పోటీ ఉంటుందని ముందే గ్రహించామని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ తీసుకోవాలనేది తమ ప్రణాళిక అని, అందులో భాగంగానే అతని కోసం పోటీపడ్డామని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ గురించి ఇంకా శ్రేయస్ అయ్యర్తో మాట్లాడలేదని, వేలానికి ముందు అతనికి ఫోన్ చేస్తే ఎత్త లేదని బదులిచ్చాడు.
'కెప్టెన్సీ గురించి శ్రేయస్ అయ్యర్తో నేను ఇంకా మాట్లాడలేదు. వేలానికి ముందు అతనికి ఫోన్ చేశాను. కానీ అతను ఎత్తలేదు. ఐపీఎల్లో అతను విజయవంతమైన కెప్టెన్. ఢిల్లీ కోచ్గా అతనితో మూడు, నాలుగేళ్లు కలిసి పనిచేశాను. అతను గత సీజన్ విన్నర్ కూడా. మళ్లీ అతనితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అతను మా జట్టు తరఫున సత్తా చాటితే నేను చాలా సంతోషిస్తాను.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ పాంటింగ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బిడ్ వేసాడు. తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్పై పై చేయి సాధించాడు. గత సీజన్ వరకు పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్కు హెడ్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. రిషభ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ చరిత్రకెక్కాడు.
IPL 2025 మెగా వేలం హైలైట్స్
అర్ష్దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్టీఎమ్)
కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)
జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)
మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)
డేవిడ్ మిల్లర్-రూ. 7.5 కోట్లు(లక్నో సూపర్ జెయంట్స్)
యుజ్వేంద్ర చాహల్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్)
లియామ్ లివింగ్ స్టోన్-రూ. 8.75 కోట్లు(ఆర్సీబీ)
కేఎల్ రాహుల్-రూ. 14 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)