టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ అద్భుత కెప్టెన్సీతోనే పాకిస్థాన్పై టీమిండియా విజయం సాధించిందని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.

బౌలింగ్లో నిప్పులు చెరిగిన బుమ్రా కారణంగానే టీమిండియా విజయం సాధించిందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే రికీ పాంటింగ్ మాత్రం.. రోహిత్ శర్మ అద్భుత కెప్టెన్సీతోనే 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా డిఫెండ్ చేయగలిగిందని తెలిపాడు. తన ఐపీఎల్ అనుభవంతోనే రోహిత్ ఈ మ్యాచ్లో భారత్ను విజయం దిశగా నడిపించాడని చెప్పాడు.
ముఖ్యంగా బౌలర్లను ఉపయోగించుకునే విషయంలో ఐపీఎల్ అనుభవం అక్కరకు వచ్చిందని చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అసాధారణ ప్రదర్శన కూడా టీమిండియా విజయానికి కారణమయ్యాయని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ వెబ్సైట్తో మాట్లాడుతూ పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'రోహిత్ శర్మ అనుభవం కలిగిన కెప్టెన్. పాకిస్థాన్తో మ్యాచ్లో రోహిత్ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. జట్టులోని బౌలర్లను సమర్థవంతంగా వాడుకున్నాడు. ప్రతీ బౌలర్తో తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేశాడు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న భారత బౌలర్లలో చాలా మంది ఐపీఎల్లో అతని కెప్టెన్సీలో ఆడివారే. దాంతో వారిని ఎప్పుడు బౌలింగ్ తీసుకురావాలి? అనే అవగాహన రోహిత్కు ఉంది. అయితే కెప్టెన్ వ్యూహం మాత్రమే రచించగలడు. బౌలర్లే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
హార్దిక్ పాండ్యా మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా బంతితో సత్తా చాటాడు. అలాగే పేసర్లు రాణించిన వికెట్పై స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పాకిస్థాన్ స్పిన్నర్లు ఇబ్బంది పడిన వికెట్పై అక్షర్ పటేల్ ఓ బిగ్ వికెట్ తీసాడు. పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో పిచ్ పూర్తిగా మారిపోయింది. సూర్యడు రావడంతో వికెట్ పొడిగా మారింది. అయినా భారత బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.