ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. వన్డే ఫార్మాట్లో ఐసీసీ టైటిల్ నెగ్గింది. సమష్టి ప్రదర్శనతో ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఓటమెరుగని జట్టుగా విశ్వవిజేతగా నిలిచింది. టీమిండియా విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తీ కీలక పాత్ర పోషించారు.
పాకిస్థాన్తో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగా.. ప్రతీ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నిలకడగా బ్యాటింగ్ చేసి భారత్ తరఫున హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. మరోవైపు వరుణ్ చక్రవర్తీ 3 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో ఈ ముగ్గురిదే కీలక పాత్ర అని అంతా భావించారు. కానీ ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం.. అక్షర్ పటేల్ది కూడా భారత విజయంలో కీలక పాత్ర అని తెలిపాడు.

బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాలని ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు. 'భారత విజయంలో అక్షర్ పటేల్కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. అతను నిలకడగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు చాలా సమతూకంగా ఉంది. ఎందుకంటే జట్టులో చాలా మంది ఆల్రౌండర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్లను చాలా సందర్భాల్లో అప్ది ఆర్డర్ ఆడించారు.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపించారు. మరో ఆల్రౌండర్ జడేజా కూడా ఉన్నాడు. దాంతోనే టీమిండియా సమతూకంగా ఉంది. భారత జట్టులో ఏదైనా సమస్య ఉందా? అంటే అది పేస్ విభాగం. కానీ వారికి పేస్ విభాగంతో పెద్దగా అవసరం పడలేదు.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అక్షర్ పటేల్ 5 మ్యాచ్ల్లో 4.35 ఎకానమీతో 5 వికెట్లు తీసాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థుల పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్లో ఐదో స్థానంలో వచ్చి 109 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.