టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు జట్టులో సుస్థిర స్థానం లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆస్టేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో అనూహ్య పరిస్థితుల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 59) అసాధారణ బ్యాటింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ గాయపడటంతోనే తనకు ఈ మ్యాచ్లో అవకాశం దక్కిందని మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
జట్టులో చోటు లేదని రాత్రి సినిమా చూస్తుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫోన్ చేసి ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపాడని, దాంతో సినిమా చూడటం ఆపేసి పడుకున్నానని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియాలో శ్రేయస్ అయ్యర్ ఎక్స్ ఫ్యాక్టర్ అని తెలిపాడు.

'భారత జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు లేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. అతను వన్డే ప్రపంచకప్ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నిలకడగా రాణిస్తూ.. మిడిలార్డర్లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడని భావించా. అతనికి గాయమై జట్టుకు దూరమయ్యాడనేది వాస్తవం. కానీ దేశవాళీ క్రికెట్లో చక్కటి ప్రదర్శన చేశాడు. దాంతో తుది జట్టులో చోటు ఖాయమని భావించా.
కానీ అయ్యర్ వ్యాఖ్యలు షాక్కు గురి చేశాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు శ్రేయస్ అయ్యరే కీలకమవుతాడు. నెమ్మదైన వికెట్లపై అతను అద్భుతంగా ఆడుతాడు. అలాగే స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

రికీ పాంటింగ్ ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కోచ్గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి పాంటింగ్ను తప్పించింది. దాంతో అతను పంజాబ్కు మారాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ను రూ. 26.75 కోట్ల భారీ ధరకు పాంటింగ్ కొనుగోలు చేసి సారథ్య బాధ్యతలు చేపట్టాడు.