
దుబాయ్: యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ నుంచి ఈ సారి కూడా చాలా ఆశిస్తున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో ఆదివారం జరిగే మ్యాచ్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ను ఆరంభించనుంది. ఈ సందర్బంగా ఢిల్లీ కోచ్ పాంటింగ్ పలు అంశాలపై మాట్లాడాడు.
'వారం రోజులుగా చూస్తున్నా రిషభ్ పంత్ మంచి టచ్లో ఉన్నాడు. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా అతని నుంచి చాలా ఆశిస్తున్నా. మా జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్లో పోటీ ఎక్కువగా ఉంది. అజింక్యా రహానే రాకతో మా బ్యాటింగ్ డెప్త్ మరింత పెరిగింది. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, పృథ్వీ షా కూడా మంచి టచ్లో ఉన్నారు. ఇక మన్కడింగ్ అంశంలో అంపైర్లు కూడా దృష్టి పెట్టాలి'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
గత సీజన్ ఐపీఎల్లో పంత్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. 16 మ్యాచ్ల్లో 488 రన్స్తో జట్టు ప్లే ఆఫ్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 27 బంతుల్లో 78 పరుగులు చేసి సత్తా చాటాడు.
అయితే కింగ్స్ పంజాబ్తో మ్యాచ్కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఫస్ట్ మ్యాచ్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.