ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సలహా ఇచ్చాడు. వైట్బాల్ ఫార్మాట్లో సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణించాలంటే బ్యాటింగ్పై మరింత ఫోకస్ పెట్టాలన్నాడు. అయితే నయా సారథిగా బ్యాటింగ్పై ఫోకస్ పెట్టడం శుభ్మన్ గిల్కు సులువైన పనికాదని అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో టీమిండియా టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలను శుభ్మన్ గిల్కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ పర్యటనతో గిల్ తన కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఈ క్రమంలోనే గిల్ బ్యాటింగ్పై మాట్లాడిన రికీ పాంటింగ్.. ఇంగ్లండ్ పర్యటన అతనికి ఓ సవాల్ అని అభిప్రాయపడ్డాడు.

'శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో సాంకేతికంగా ఎలాంటి లోపాలు లేవు. కానీ టెస్ట్ ఫార్మాట్లో గిల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయడం లేదా లేజీగా ఆడటమో చేస్తున్నాడు. 6 లేదా 7 గంటల పాటు ప్రతీ బంతిని 100 శాతం నిబద్దతో ఆడటం శుభ్మన్ గిల్కు పెద్ద ఛాలెంజ్. శుభ్మన్ గిల్ తన కెప్టెన్సీ భారాన్ని తగ్గించుకోవడానికి నెంబర్ 4లో బ్యాటింగ్ చేయాలి. అలాగే భారత బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేయాలి.
యశస్వి జైస్వాల్తో పాటు సాయి సుదర్శన్ను ఓపెనర్లుగా ఆడించాలి. నెంబర్-3లో మరింత అనుభవం కలిగిన ఆటగాడిని ఆడించాలి. కేఎల్ రాహుల్ లేదా కరుణ్ నాయర్ను మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపించాలి. అప్పుడు శుభ్మన్ గిల్ నెంబర్ 4లో ఆడవచ్చు. టెస్ట్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత మళ్లీ శుభ్మన్ గిల్ను మూడో స్థానంలో ఆడించవచ్చు.
సాయి సుదర్శన్ అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సమయం. రోహిత్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సాయి సుదర్శన్తో వారు లేని లోటును కొంత వరకు భర్తీ చేయవచ్చు. సాయి సుదర్శన్ ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. సూపర్ ఫామ్లో ఉన్నాడు.
కేఎల్ రాహుల్ను మిడిలార్డర్లో ఆడిస్తే టీమ్ కాంబినేషన్ మరింత మెరుగ్గా ఉంటుంది. మొత్తంగా ఇంగ్లండ్ పర్యటన.. శుభ్మన్ గిల్కు కెప్టెన్గా.. బ్యాటర్గా అతి పెద్ద సవాల్గా మారనుంది.'అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.