
స్నేహితుడు సిఫార్స్ చేసాడు:
రిచర్డ్ మాడ్లీ తాజాగా మైఖేల్ నిర్వహించిన చిట్చాట్ షోలో పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు. ఐపీఎల్తో మీ అనుబంధం ఎలా ప్రారంభమైంది అని అడగ్గా... '2007లో ఐపీఎల్ కాన్సెప్ట్ లలిత్ మోడీ, ఐఎమ్జీ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూ వైల్డ్ బ్లడ్ ఆలోచనలతో మొదలైంది. ప్రారంభ సంభాషణలు క్రికెట్ మ్యాచ్లో కాకుండా ఆ సంవత్సరం వేసవిలో వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో జరిగాయి. మోడీ విప్లవాత్మక ఆలోచనలు, ఆండ్రూ అనుభవం బాగా పనికొచ్చింది. ఎనిమిది 'ఫ్రాంచైజ్'లు ఉండాలని నిర్ణయించారు. ఆటగాళ్ల వేలం నిర్వహించాలని నిర్ణయించినప్పుడు.. నా స్నేహితుడు ఆండ్రూ నా పేరు సిఫార్స్ చేసాడు' అని రిచర్డ్ చెప్పారు.

టెన్షన్ ఫీల్ అయ్యా:
2008లో జరిగిన మొదటి వేలంలో మీ అనుభవం ఏంటి అని ప్రశ్నించగా... 'వేలం ప్రారంభానికి ముందు కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యా. ఓపెనింగ్ చేసే బ్యాట్స్మన్లాగ. ఏదైనా పెద్ద పెర్ఫామెన్స్ చేసేముందు టెన్షన్ చాలా సహజం, అయితే సానుకూల ధోరణిలో వెళ్ళాలి. ఇక ఆ సమయంలో ఇంగ్లండ్ దేశంలో వింటర్ కాబట్టి.. ఇక్కడికి వచ్చాక చాలా వేడిగా అనిపించింది' అని పేర్కొన్నారు. 'మొదటి వేలం ముందు సన్నద్ధమవడానికి ఎక్కువ సమయం లేదు, కేవలం 75 మంది ఆటగాళ్ళు ఉండడంతో నా పని సులువు అయింది. ఆ తర్వాత మాత్రం 400 మంది ఆటగాళ్లు ఉండేవారు. అప్పుడు ఉచ్చారణపై కష్టపడాల్సి వచ్చింది. వేలం ముందు పదాలను ఎలా ఉచ్చరించాలో జట్టు యజమానులు సహాయం చేసేవారు. వేలం ముందు రాత్రి నిద్రపట్టేది కాదు కాదు' అని రిచర్డ్ పేర్కొన్నాడు.

శిల్ప శెట్టి తెలుసు కానీ.. ప్రీతి జింటా తెలియదు:
'భారతీయ పేర్లను ఉచ్చరించే అనుభవం నాకు లేదు. కొందరి పేర్లు పలకడానికి క్లిష్టంగా ఉండేవి. శ్రీలంక ఆటగాళ్ల పేర్లును కూడా సరిగా పలకలేకపోయేవాడిని. దీంతో వేలం వేయడానికి ముందు వారి పేర్లను ఓసారి చెదివేవాడిని. మొదటి వేలం నిర్వహించినప్పుడు షారూఖ్ ఖాన్కు ఎంత క్రేజ్ ఉందో నాకు తెలియదు. శిల్ప శెట్టి గురించి తెలుసు కానీ.. ప్రీతి జింటా గురించి తెలియదు. ఐపీఎల్ యజమానులతో మంచి స్నేహం ఉంది. నాకు ఇష్టమైన జట్లు లేదా ఆటగాళ్ళు లేరు కానీ టోర్నమెంట్ జరిగే సమయంలో అన్ని జట్ల ఆటను చూస్తా' అని రిచర్డ్ తెలిపాడు.

అభిమానితో సెల్ఫీ మర్చిపోను
'క్రికెట్ అభిమానులు నన్ను మొదటి వేలం నుండి బాగా ఆదరించారు. 'హ్యామర్ మ్యాన్'గా నామకరణం చేసినందుకు చాలా సంతోషంగా ఉండేది. నా వాయిస్ వేలానికి పర్యాయపదంగా మారింది. గత రెండు వేలంలో ఆహ్వానించబడనప్పటికీ నేను ఇంకా ఇష్టంతోనే ఉన్నాను. బెంగుళూరులోని ఒక హోటల్లో ఓ అభిమానితో సెల్ఫీ దిగా, అదెప్పటికీ మర్చిపోను. గత రెండు వేలంను నేను చూశా. ఇక ఐపీఎల్ మ్యాచ్లను అభిమానులకంటే ఎక్కువగా చూసా. నేను హోస్ట్గా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను వరుసగా 10 వేలం పాటలకు హోస్ట్గా చేశా. ఈ రికార్డు ఎప్పుడూ విచ్ఛిన్నం అయ్యే అవకాశం లేదు. నా జీవితం గురించి ఒక పుస్తకం రాయడానికి ఆలోచిస్తూ కరోనా సమయం గడుపుతున్నా' అని రిచర్డ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












