
ముంబై : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా.. అతని బ్రాండ్ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహీ బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులో ఎలాంటి తగ్గింపు ఉండదని, ఆటకు గుడ్బై చెప్పక ముందు తీసుకుంటున్న ఫీజునే భవిష్యత్తులో కూడా తీసుకోనున్నాడని తెలిపారు.
భారత 74 స్వాతంత్ర్య దినోత్సవం నాడే ధోనీ ఓ ఇన్స్టా పోస్ట్తో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో షేర్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పినా ఐపీఎల్లో కొనసాగనున్నాడు. ఐపీఎల్ తర్వాత ఆటకు దూరమైనా.. అతని బ్రాండ్ విలువలో ఎలాంటి తగ్గుదల ఉండదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ధోనీ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ పోకర్స్టార్స్, కార్స్ 24, ఇండియన్ టెర్రైన్, రెడ్ బస్, లగ్జరీ వాచ్ బ్రాండ్ పనేరాయ్, అశోక్ లేలాండ్, కోకాకోలా యొక్క స్పోర్ట్స్ డ్రింక్ పవర్డే, స్నికర్స్, డ్రీమ్ 11, గల్ఫ్ ఆయిల్ ఇండియా, ఇండిగో పెయింట్స్, రియాల్టీ కంపెనీ సుమధురా గ్రూప్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. 39 ఏళ్ల ధోనీ ఆన్లైన్ రిటైలర్ ఫ్లిప్కార్ట్, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (అంఫి) తో పలు ప్రాజెక్టు ఆధారిత బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఒక రోజు షూటింగ్కు ధోనీ రూ.1.5 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. అతని రిటైర్మెంట్తో ఈ ఫీజులో ఎలాంటి మార్పు ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పినప్పుడే అతని బ్రాండ్ విలువ చాలా తగ్గిందని, అప్పటి నుంచి స్థిరంగా ఉందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ చీఫ్ సందీప్ గోయల్ అన్నారు. 'బహుషా విరాట్ కోహ్లీ చార్జ్ చేస్తున్న దాంట్లో ధోనీ సగం వసూలు చేస్తున్నాడనుకుంటా. ఓ బ్రాండ్ మేనేజర్గా నా అంచనా ప్రకారం ధోనీ విలువ ఇప్పట్లో తగ్గదు. అతను కంపెనీలకు కాస్ట్ ఎఫెక్టివ్ చాయిస్'అని గోయల్ తెలిపారు.