
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ తమ దేశంలో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) కోరినట్లు తెలుస్తోంది. టీమిండియా సౌతాఫ్రికా పర్యటన విజయవంతమైన నేపథ్యంలో ఈ రిక్వెస్ట్ చేసిన క్రిక్బజ్ పేర్కొంది. భారత్లో ఐపీఎల్ నిర్వహించలేని పరిస్థితులు ఉంటే తాము ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని భారత క్రికెట్బోర్డుకు తెలియజేసినట్లు సమాచారం. ఈ మేరకు సీఎస్ఏ ప్రెసిడెంట్ గ్రేమ్ స్మిత్.. బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
భారత్లో కరోనా ఉధృతి తగ్గకపోతే ఐపీఎల్ 2022 సీజన్ను గతంలో మాదిరి యూఏఈ వేదికగా కాకుండా తమ దేశంలో నిర్వహించాలని ఆ లేఖలో పేర్కొందని ప్రచారం జరుగుతుంది. సౌతాఫ్రికాలో ధనాధన్ లీగ్ నిర్వహించడం వల్ల బోర్డు, ఫ్రాంచైజీలకు లాభాలు మిగులుతాయని వివరించినట్లు తెలుస్తోంది.
యూఏఈతో పోల్చుకుంటే సౌతాఫ్రికాలో ఖర్చులు చాలా తక్కువని, రవాణా, హోటల్ ఖర్చులు ఫ్రాంచైజీలకు కలిసొస్తాయని పేర్కొంది. కట్టుదిట్టమైన బయోబబుల్ ఏర్పాట్ల నడుమ నాలుగు వేదికల్లోనే లీగ్ను నిర్వహిస్తామని ప్రతిపాదించింది. జోహన్నెస్ బర్గ్లోని వాండరర్స్ స్టేడియం, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, బెనోనిలోని విల్లోమూర్ పార్క్, సెన్యూస్ క్రికెట్ స్టేడియం దగ్గర దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా 74 మ్యాచ్ల్లో కొన్నిటిని కేప్ టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియం, పార్ల్ వేదికగా నిర్వహించుకోవచ్చని కూడా తెలిపింది. ఇక 2009లో భారత్లో ఎన్నికల కారణంగా ఆ సీజన్ ఐపీఎల్లో సౌతాఫ్రికా వేదికగా 8 వేదికల్లో నిర్వహించారు.
అయితే ఈ ఏడాది ఐపీఎల్ను ఎలాగైనా భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఐపీఎల్ నిర్వహణకు తొలి చాయిస్ భారత్ అయినప్పటికీ.. యూఏఈ, సౌతాఫ్రికా వేదికలను కూడా పరిశీలిస్తోంది. ఐపీఎల్ 2022 వేదికపై ఫిబ్రవరి 20 తేదీలోగా తేలుస్తామని ఐపీఎల్ జట్లకు సైతం ఇదివరకే స్పష్టం చేసింది. ఇక ఏప్రిల్ 2 నుంచి జూన్ 3 మధ్య ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.