ఐపీఎల్ 2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని హోంబాలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన రాకపోయినా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు, డీల్ దాదాపు పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాంచైజీని పూర్తిగా కొనుగోలు చేయకపోయినా.. సహయజమానికి వ్యవహరించేందుకు హోంబాలే ఫిల్మ్స్ సంస్థ చర్చలు జరుపుతున్నట్లు బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఆర్సీబీ ఫ్రాంచైజీకి ప్రస్తుతం డియాజియో ఇండియా యజమానిగా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఆర్సీబీ ఫ్రాంచైజీని డియాజియో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాంచైజీ విలువ సుమారుగా 2 బిలియన్ల అమెరికా డాలర్లుగా(రూ.17000 కోట్లు) ఉంటుందని అంచనా.

డియాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం. డియాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ..ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలనే యోచనలో డియాజియో ఉన్నట్లు తెలుస్తోంది.
'కేజీఎఫ్', 'కాంతార'తో పాటు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ఇప్పటికే ఆర్సీబీకి డిజిటల్ పార్ట్నర్గా కొనసాగుతోంది. ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న ప్రధాన పోటీదారుల్లో హోంబాలే ఫిల్మ్స్ టాప్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డియాజియో కంపెనీతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఈ కొనుగోలుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు ఏదీ రాలేదు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని ఆర్సీబీ జట్టు అంతర్గత వర్గాలు పేర్కొన్నాయి.
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్, చలువే గౌడ హోంబాలే ఫిల్మ్స్ ను 2012లో ప్రారంభించారు. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా చిత్రాలతో ఈ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2023లో ఆర్సీబీ డిజిటల్ పార్ట్నర్గా ఒప్పందం కుదుర్చుకోవడంతో మరింత పాపులర్ అయ్యింది.
ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్, అదానీ గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్, సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ ఆదర్ పూనావాలాలు కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.