SRH వైఫల్యానికి టీమ్మేనేజ్మెంట్ చెత్త నిర్ణయాలే కారణమా?

న్యూఢిల్లీ: ఆడింది ఏనిమిది సీజన్లు.. ఓసారి టైటిల్ విన్నర్.. ఇంకోసారి రన్నరప్.. నాలుగు సార్లు ప్లే ఆఫ్స్.. ఇంకో రెండు సార్లు ఆరో స్థానం... ఐపీఎల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ట్రాక్ రికార్డు ఇది. చూస్తుండగానే పాయింట్ల పట్టికలో పైకెళ్లడం.. చడీచప్పుడు లేకుండా ప్లేఆఫ్స్కు దూసుకెళ్లడం ఆ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య. జట్టును నడిపించేది ఎవరైనా పెర్ఫామెన్స్లో తేడా ఉండదు. టీమ్ బ్యాలెన్స్లో మార్పు కనిపించదు. రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లో ఇరగదీసి ప్రత్య్రర్థి తలవంచడం ఆరెంజ్ ఆర్మీ స్టైల్.!
కానీ ఆ సన్రైజర్స్ ఇప్పుడు చతికలపడుతోంది. పసలేని బ్యాటింగ్, పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్తో వరుసగా ఓటమి పాలవుతుంది. ఇప్పటికే సగం సీజన్ పూర్తయినా ఒకే ఒక్క విజయంతో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ప్లేఆఫ్స్ చేరడం దాదాపు కష్టమే. అయితే, సన్రైజర్స్ ఇలా వైఫల్యం చెందడానికి టీమ్మేనేజ్మెంట్ చెత్త నిర్ణయాలతో పాటు మిడిలార్డర్ బలహీనతే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

నాలుగూ గెలవాల్సినవే..
ఈ సీజన్లో సన్రైజర్స్ 2 పాయింట్లతో అందరికన్నా చిట్ట చివరి స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. అయితే, ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడానికి ప్రధాన కారణం స్వయంకృతాపరాధమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగు గెలవాల్సినవే. వాటి ఫలితాలు గమనిస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కోల్కతా, బెంగళూరు, ముంబై, పంజాబ్తో జరిగిన మ్యాచ్ల్లో సన్రైజర్స్ విజయం ముగింట బోల్తా పడింది. ఈ మూడు మ్యాచ్ల్లో మిడిలార్డర్ బలహీనతతోనే సన్రైజర్స్ ఓటమిపాలైంది. ఈ నాలుగు మ్యాచ్ల్లోనూ మొత్తంగా చూస్తే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే పరుగులు చేశారు.

ఆ నలుగురు మినహా..
ఓపెనర్లుగా ఆడే బెయిర్స్టో, డేవిడ్ వార్నర్ లేదంటే తర్వాత వచ్చే మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్. మిగత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ పూర్తిగా చేతులేత్తేశారు. సన్రైజర్స్ తరఫున బెయిర్స్టో ఏడు మ్యాచ్లాడి 41.33 సగటుతో 248 పరుగులు సాధించాడు. తర్వాత డేవిడ్ వార్నర్ 32.16, మనీశ్ పాండే 48.25 సగటులతో చెరో 193 పరుగులు చేశారు. ఆపై విలియమ్సన్ నాలుగు మ్యాచ్ల్లో సగటుతో 128 పరుగులు చేశాడు. వీరందరి తర్వాత విజయ్ శంకర్ 7 మ్యాచ్ల్లో 11.60 ఘోరమైన సగటుతో 58 పరుగులు చేశాడు. ఈ గణంకాలొక్కటే చాలు సన్రైజర్స్ మిడిల్ ఆర్డర్ ఎలా ఆడుతుందనే విషయం చెప్పడానికి. అదే బెడిసికొట్టింది.

25 మందిలో 21 మందికి చాన్స్..
ఈ సీజన్లో ఏ జట్టూ చేయనన్ని ప్రయోగాలు సన్రైజర్స్ టీమ్మేనేజ్మెంట్ చేసింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో మొత్తం 21 మంది ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అయినా ఏ ప్రయోజనం లేకపోయింది. మొత్తం ఏడు మ్యాచ్ల్లో ఐదుసార్లు కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. దాంతో సరైన జట్టు కూర్పు లోపించిందని స్పష్టంగా తెలుస్తోంది. టాప్ఆర్డర్ మినహా లోయర్ ఆర్డర్లో ఎవరు ఏ మ్యాచ్లో ఉంటారో ఏ మ్యాచ్లో ఉండరో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తంగా జట్టులో 25 మందిలో 21 మందిని ఇప్పటికే ఆడించింది. ఇక మిగిలిన ఆ నలుగురికి ఎప్పుడు అవకాశం ఇస్తుందో చూడాలి. పైగా డేవిడ్ వార్నర్ను జట్టు నుంచి తప్పించి మరో ఘోర తప్పిదం చేసిన సన్రైజర్స్ టీమ్మేనేజ్మెంట్.. రాబోయే మ్యాచ్ల్లో ఇంకెన్ని ప్రయోగాలు చేస్తుందో చూడాలి

దెబ్బతీసిన బౌలింగ్ వైఫల్యం..
సన్రైజర్స్కు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్య ఎప్పటినుంచో ఉన్నదే. అయితే, బలమైన టాపార్డర్, మేటి బౌలింగ్ విభాగం ఉన్నందున ఇన్ని రోజులూ ఆ లోటు పెద్దగా తెరపైకి రాలేదు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. రషీద్ మినహా మిగతా బౌలర్లు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నటరాజన్ గాయంతో తప్పుకున్నాడు. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ పూర్తిగా తేలిపోతున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో 9.10 ఎకానమీతో 3 వికెట్లే తీశాడు. రషీద్ఖాన్ ఒక్కడే ఏడు మ్యాచ్ల్లో 6.14 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా విజయ్ శంకర్, సిద్ధార్థ్ కౌల్ చెరో మూడు వికెట్లతో దిగువ స్థాయిలో కొనసాగుతున్నారు. ఇది టీమ్కు పెద్ద సమస్యగా మారింది. మొత్తానికి స్వయంకృతాపరాధమే సన్రైజర్స్ కొంపముంచిందనేది వాస్తవం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications