నాలుగూ గెలవాల్సినవే..
ఈ సీజన్లో సన్రైజర్స్ 2 పాయింట్లతో అందరికన్నా చిట్ట చివరి స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. అయితే, ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడానికి ప్రధాన కారణం స్వయంకృతాపరాధమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగు గెలవాల్సినవే. వాటి ఫలితాలు గమనిస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కోల్కతా, బెంగళూరు, ముంబై, పంజాబ్తో జరిగిన మ్యాచ్ల్లో సన్రైజర్స్ విజయం ముగింట బోల్తా పడింది. ఈ మూడు మ్యాచ్ల్లో మిడిలార్డర్ బలహీనతతోనే సన్రైజర్స్ ఓటమిపాలైంది. ఈ నాలుగు మ్యాచ్ల్లోనూ మొత్తంగా చూస్తే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే పరుగులు చేశారు.
ఆ నలుగురు మినహా..
ఓపెనర్లుగా ఆడే బెయిర్స్టో, డేవిడ్ వార్నర్ లేదంటే తర్వాత వచ్చే మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్. మిగత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ పూర్తిగా చేతులేత్తేశారు. సన్రైజర్స్ తరఫున బెయిర్స్టో ఏడు మ్యాచ్లాడి 41.33 సగటుతో 248 పరుగులు సాధించాడు. తర్వాత డేవిడ్ వార్నర్ 32.16, మనీశ్ పాండే 48.25 సగటులతో చెరో 193 పరుగులు చేశారు. ఆపై విలియమ్సన్ నాలుగు మ్యాచ్ల్లో సగటుతో 128 పరుగులు చేశాడు. వీరందరి తర్వాత విజయ్ శంకర్ 7 మ్యాచ్ల్లో 11.60 ఘోరమైన సగటుతో 58 పరుగులు చేశాడు. ఈ గణంకాలొక్కటే చాలు సన్రైజర్స్ మిడిల్ ఆర్డర్ ఎలా ఆడుతుందనే విషయం చెప్పడానికి. అదే బెడిసికొట్టింది.
25 మందిలో 21 మందికి చాన్స్..
ఈ సీజన్లో ఏ జట్టూ చేయనన్ని ప్రయోగాలు సన్రైజర్స్ టీమ్మేనేజ్మెంట్ చేసింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో మొత్తం 21 మంది ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అయినా ఏ ప్రయోజనం లేకపోయింది. మొత్తం ఏడు మ్యాచ్ల్లో ఐదుసార్లు కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. దాంతో సరైన జట్టు కూర్పు లోపించిందని స్పష్టంగా తెలుస్తోంది. టాప్ఆర్డర్ మినహా లోయర్ ఆర్డర్లో ఎవరు ఏ మ్యాచ్లో ఉంటారో ఏ మ్యాచ్లో ఉండరో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తంగా జట్టులో 25 మందిలో 21 మందిని ఇప్పటికే ఆడించింది. ఇక మిగిలిన ఆ నలుగురికి ఎప్పుడు అవకాశం ఇస్తుందో చూడాలి. పైగా డేవిడ్ వార్నర్ను జట్టు నుంచి తప్పించి మరో ఘోర తప్పిదం చేసిన సన్రైజర్స్ టీమ్మేనేజ్మెంట్.. రాబోయే మ్యాచ్ల్లో ఇంకెన్ని ప్రయోగాలు చేస్తుందో చూడాలి
దెబ్బతీసిన బౌలింగ్ వైఫల్యం..
సన్రైజర్స్కు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్య ఎప్పటినుంచో ఉన్నదే. అయితే, బలమైన టాపార్డర్, మేటి బౌలింగ్ విభాగం ఉన్నందున ఇన్ని రోజులూ ఆ లోటు పెద్దగా తెరపైకి రాలేదు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. రషీద్ మినహా మిగతా బౌలర్లు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నటరాజన్ గాయంతో తప్పుకున్నాడు. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ పూర్తిగా తేలిపోతున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో 9.10 ఎకానమీతో 3 వికెట్లే తీశాడు. రషీద్ఖాన్ ఒక్కడే ఏడు మ్యాచ్ల్లో 6.14 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా విజయ్ శంకర్, సిద్ధార్థ్ కౌల్ చెరో మూడు వికెట్లతో దిగువ స్థాయిలో కొనసాగుతున్నారు. ఇది టీమ్కు పెద్ద సమస్యగా మారింది. మొత్తానికి స్వయంకృతాపరాధమే సన్రైజర్స్ కొంపముంచిందనేది వాస్తవం.