రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిసాయి. చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ ఉన్నారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో ఆర్సీబీ సంబరం చిన్నబోయింది.
అసలేం జరిగిందంటే..?
18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ టైటిల్ గెలవడంతో దేశవ్యాప్తంగా ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బెంగళూరులో ఈ సంబరాలు మిన్నంటాయి. తమ అభిమాన జట్టును చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసింది. బెంగళూరులోని విధాన సౌద నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ ఉంటుందని ప్రకటించింది. దాంతో విజేతలుగా నిలిచిన తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దాంతో ఆ ప్రాంతమంతా ఎర్రసముద్రాన్ని తలపించింది.

అనుమతివ్వని పోలీసులు..
వాస్తవానికి ఆర్సీబీ విక్టరీ పరేడ్కు బెంగళూరు పోలీసులు అనుమతివ్వలేదని వార్తలు వచ్చాయి. దాంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ చిన్నస్వామి స్టేడియంలోనే విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందని ప్రచారం జరిగింది. ఈ విజయోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం కావడంతో పోలీసులు అనుమతిచ్చినట్లు అర్థమవుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆర్సీబీ ఆటగాళ్లకు స్వాగతం పలికారు. విధాన సౌధ ముందు ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక సీఎం సిద్దరామయ్య సత్కరించారు.
వర్షం కారణంగా..
సీఎం సిద్దరామయ్యతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు ఈ వేడుకల్లో భాగం కావడంతో పోలీసులు వారి చుట్టే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విధాన సౌద వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించడంతో అక్కడ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆ తర్వాత ఆర్సీబీ ఓపెన్ బస్ పరేడ్ ఉండటంతో వారికి అదనపు బలగాలను కేటాయించారు. దాంతో చిన్నస్వామి స్టేడియం వద్ద పోలీసుల సంఖ్య తగ్గింది. ఆ సమయంలోనే వర్షం పడటంతో ఆర్సీబీ ఓపెన్ బస్ పరేడ్ను రద్దు చేశారు. దాంతో అయోమయానికి గురైన అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తారు.
పోలీసుల వైఫల్యం..
35 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన మైదానానికి 2-3 లక్షల మంది అభిమానులు వచ్చారని కర్ణాటక సీఎం సిద్దరామయ్యనే తెలిపారు. అభిమానులు సంఖ్య పెరగడం.. ఇందులో కొందరు గొడలు, చెట్లు ఎక్కి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. వర్షం కూడా పడటంతో అభిమానులంతా ఒకే చోటికి గూమిగూడారు. గేట్-2 వద్ద లోపలికి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.
ఇంత భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని అంచనా వేయడంలో అధికారులు, పోలీసులు విఫలమయ్యారు. అభిమానులను అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. భవిష్యత్తులో క్రీడా స్టేడియాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఈ ఘటన ఓ గుణపాఠంగా నిలవనుంది.