చెన్నై: టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇస్తే అద్భుతంగా ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విధ్వంసకర బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మరోసారి సౌతాఫ్రికా తరఫున ఆడే అవకాశం వస్తే తప్పకుండా ఉపయోగించుకుంటానన్నాడు. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 38 పరుగులతో గెలుపొందింన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన ఏబీడీ(34 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
ఇక ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లోకి రావడానికి దారులు తెరిచే ఉన్నాయని సౌతాఫ్రికా కోచ్ బౌచర్ చేసిన వ్యాఖ్యలపై డివిలియర్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ స్పందించాడు. 'నాకు టీమ్లో చోటు దక్కితే చాలా అద్భుతంగా ఉంటుంది. సౌతాఫ్రికాకు మళ్లీ ఆడాలని నాకు చాలా ఆసక్తి ఉంది. నా ఫామ్, ఫిట్నెస్ కూడా బాగున్నాయి. అందుకే 15 మంది టీమ్లో నేను ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఏదేమైనా టీమ్ ప్రయోజనాలకు అనుగుణంగా మా ప్లాన్స్ ఉంటాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత మార్క్ బౌచర్తో మాట్లాడుతా'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
గత శుక్రవారం బౌచర్ మాట్లాడుతూ ఏబీడీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్నాడు. ఐపీఎల్ 2021కు ముందే ఈ విషయమై ఏబీడితో మాట్లాడనని తెలిపాడు. అతను ఐపీఎల్తో తన సత్తా నిరూపించుకోవాలనుకుంటున్నాడని తెలిపాడు. 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఏబీడీ.. సౌతాఫ్రికా తరఫున 114 టెస్ట్లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.
కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (49 బంతుల్లో 78; 9 ఫోర్లు, 3 సిక్స్లు)... ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించారు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి ఓడిపోయింది. ఆండ్రీ రసెల్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఇయాన్ మోర్గాన్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్లు), షకీబుల్ హసన్ (25 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) జట్టు విజయం కోసం విఫలయత్నం చేశారు.