
కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ
21 ఏళ్ల జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ది సాధారణ కుటుంబం. ఇతని తండ్రి అబ్దుల్ మాలిక్ కూరగాయలు, పండ్ల వ్యాపారి. తమ ప్రాంతంలో కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కుమారుడుకి చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఆసక్తి ఉండడంతో.. కాదనలేకపోయాడు. ఉమ్రాన్ మాలిక్ చదువు, క్రికెట్ సాధనకు ఎంతో ఖర్చు అయినా భరించాడు. ఉమ్రాన్ కూడా ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగాడు.
దేశవాళీల్లో సత్తాచాటడంతో ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. తన కుమారుడు ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ మాలిక్ తాజాగా పేర్కొన్నారు.
RCB vs SRH: ఆ ప్రణాళికతోనే ఏబీ డివిలియర్స్ను కట్టడి చేశా: భువనేశ్వర్

నన్ను గర్వపడేలా చేశాడు
'నా కుమారుడికి చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని ఎప్పుడూ కలలు కనేవాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేయడంతో చాలా సంతోషించాము. మ్యాచ్ జరుగుతున్నసేపు టీవీనే చూస్తూండేవాడు. ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నాడు. నాకు, నా భార్యకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇది మమూలు విషయం కాదు. మాది చాలా పేద కుటుంబం.
నేను పండ్లు, కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నా కుమారుడు నన్ను గర్వపడేలా చేశాడు. మా ఆనందానికి ఇపుడు అవధులు లేవు. ఉమ్రాన్ని లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా అభినందించాడు. ఏదో ఒకరోజు అతడు టీమిండియాకు ఆడతాడనే నమ్మకం ఉంది' అని అబ్దుల్ మాలిక్ ధీమా వ్యక్తం చేశారు.

గంటకు 153 కిలోమీటర్ల వేగం
బుధవారం అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్.. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని సంధించాడు. దీంతో ఐపీఎల్ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్గా నిలిచాడు. బెంగళూరు ఇన్నింగ్స్లో భాగంగా తొమ్మిదో ఓవర్ నాలుగో బంతిని ఉమ్రాన్ గంటకు 153 కిలోమీటర్ల వేగంతో విసిరాడు.
ఆ బంతికి ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇక ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్గా దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్న నోర్జ్.. ఐపీఎల్ 2020లో గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సందించాడు.


Click it and Unblock the Notifications












