ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్కు తనను పక్కన పెట్టలేదని, తానే స్వయంగా తప్పుకున్నానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( ఆర్సీబీ) విధ్వంసకర ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ తెలిపాడు. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇతరులకు అవకాశం ఇవ్వాలనే ఇలా చేశానని తెలిపాడు.
సోమవారం జరిగిన ఈ హైస్కోరింగ్ గేమ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఆరో పరాజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మ్యాక్స్వెల్.. తన గైర్హాజరీకి గల కారణాన్ని వెల్లడించాడు. మానసికంగా, భౌతికంగా రిఫ్రెష్ అయ్యేందుకే ఈ మ్యాచ్కు దూరమయ్యానని తెలిపాడు.

'ఈ సీజన్లో నేను నా ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయాను. దాంతోనే సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వెంటనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని చెప్పాను. నా ప్లేస్లో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని సూచించాను. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నాకు కొత్త కాదు.
గతంలోనూ నేను ఇలాంటి చెత్త ప్రదర్శనలు చేశాను. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో కూడా నాకు తెలుసు. అందుకే మానసిక ప్రశాంతతో పాటు నా శరీరానికి రెస్ట్ ఇవ్వాలనుకున్నాను. నేను మానసికంగా ఫిట్ అయితే ఈ సీజన్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆర్సీబీ జట్టుపై నా ప్రభావం చూపిస్తాను.'అని మ్యాక్స్వెల్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్.. మూడు సార్లు డకౌటయ్యాడు. ఒకే ఒక్కసారి రెండు అంకెల స్కోర్ చేశాడు. వరుసగా 0, 3, 28, 0, 1, 0లతో విఫలమయ్యాడు. బౌలింగ్లో మాత్రం 4 వికెట్లు తీసాడు. ఆర్సీబీ ఆడే తదుపరి మ్యాచ్లో గ్లేన్మ్యాక్స్వెల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్లతో 102) సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లతో 67) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్లతో 83), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 62)హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం(ఏప్రిల్ 21) కోల్కతా వేదికగా కేకేఆర్తో ఆడనుంది.