
పుణే: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్లో టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకొని విఫలమైన వేళ.. యువ ప్లేయర్ రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్.. ఆర్సీబీ ముందు 145 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ తర్వాత సంజూ శాంసన్(27) టాప్ స్కోరర్గా నిలిచాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో సిక్సర్తో దూకుడు కనబర్చిన దేవదత్ పడిక్కల్(7).. వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులోకి వచ్చి అశ్విన్ 4 ఫోర్లతో దూకుండా ఆడాడు. అయితే సిరాజ్ సూపర్ బౌన్సర్తో అతన్ని బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే సెంచరీల హీరో జోస్ బట్లర్(8)ను సిరాజ్ సూపర్ క్యాచ్తో హజెల్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు సంజూ శాంసన్ భారీ సిక్సర్లతో రన్రేట్ తగ్గకుండా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ 3 వికెట్లకు 43 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం ధాటి ఆడిన సంజూ శాంసన్కు హర్షల్ పటేల్ చెక్ పెట్టాడు. సూపర్ గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత డారిల్ మిచెల్, రియాన్ పరాగా నిదానంగా ఆడారు. భారీ షాట్లు రాకపోవడంతో ఒత్తిడికి గురైన డారిల్ మిచెల్ భారీ షాట్కు ప్రయత్నించి మ్యాక్స్వెల్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత హెట్మైర్ను హసరంగా ఔట్ చేయగా.. ట్రెంట్ బౌల్ట్ను హర్షల్ పటేల్ పెవిలిన్ చేర్చాడు. ఇక హజెల్ వుడ్ వేసిన 19వ ఓవర్లో రియాన్ పరాగ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను హసరంగా నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన రియాన్ పరాగ్.. ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లతో 18 పరుగులు పిండుకొని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో పాటు జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. క్రీజును వీడే క్రమంలో హర్షల్ పటేల్తో పరాగ్ వాగ్వాదానికి దిగాడు.