అబుదాబి: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (3/24) మాయ చేశాడు. అతని మాయాజాలానికి ఇసురు ఉడానా(2/41), సైనీ(1/37) పేస్ కూడా తోడవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ చేతులెత్తేసింది.
కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాడు మహిపాల్ లోమ్రోర్(39 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 47) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్ తర్వాత జోస్ బట్లర్(22) టాప్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో ఆర్చర్(16 నాటౌట్), రాహుల్ తెవాటియా(24 నాటౌట్ మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ మూడు, ఉడానా రెండు వికెట్లు తీయగా.. సైనీ ఒక వికెట్ పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5), ఓపెనర్ జోస్ బట్లర్ (22), యువ ఆటగాడు సంజూ శాంసన్ (4)విఫలమయ్యారు.పేసర్ ఇసురు ఉడానా వేసిన మూడో ఓవర్లో స్మిత్ బౌల్డయ్యాడు. నవదీప్ సైనీ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే జోస్ బట్లర్ (22) దేవదత్ పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వచ్చీ రావడంతోనే కీలక వికెట్ పడగొట్టాడు.
చహల్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికే హార్డ్హిట్టర్ సంజూ శాంసన్ (4) రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్యాచ్ను పట్టే క్రమంలో కాస్త సందిగ్థం నెలకొంది. చాహల్ బంతిని గ్రౌండ్కు టచ్ చేశాడా.. అనే దానిపై సమీక్షకు వెళ్లగా.. పలు కోణాల్లో ఆ క్యాచ్ను పరిశీలించిన తర్వాత బంతి గ్రౌండ్కు టచ్ కాలేదని థర్డ్ అంపైర్ తేల్చాడు. బంతి క్రింద పడుతున్న సమయంలో చాహల్ వేళ్లు ఉన్నాయని తేల్చిన థర్డ్ అంపైర్.. అది ఔట్గా ప్రకటించాడు. కానీ బంతి గ్రౌండ్కు తగిలినట్లు కొన్ని కోణాల్లో స్పష్టమైంది.
ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (17) కూడా వెనుదిరగడంతో రాజస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మహిపాల్ ఒంటరి పోరాటం చేశాడు. నిదానంగా ఆడుతూ జట్టును గట్టెక్కించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన మహిపాల్ను చాహల్ ఔట్ చేశాడు. చివర్లో రాహుల్ తేవాటియా, జోఫ్రా ఆర్చర్ ధాటిగా ఆడటంతో రాజస్థాన్ 154 పరుగులు చేయగలిగింది.