బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) లోయరార్డర్ మరోసారి దారుణంగా విఫలమైంది. దాంతో ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 62), గ్లేన్ మ్యాక్స్వెల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగినా సాధారణ స్కోర్కే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ సూపర్ ఫీల్డింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసింది.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ట్రెంట్ బౌల్ట్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఫస్ట్ బాల్కే ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ(0)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించి గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చిన ట్రెంట్ బౌల్ట్.. ఐపీఎల్లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన షెబాజ్ అహ్మద్(2)ను కూడా బౌల్ట్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడగా .. ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్వెల్ విధ్వంసకర బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. వచ్చిరావడంతోనే మ్యాక్సీ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడటంతో ఆర్సీబీ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తింది.
ఈ క్రమంలో గ్లేన్ మ్యాక్స్వెల్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 31 బంతుల్లో ఫాఫ్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో ఫాఫ్ డుప్లెసిస్కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. 127 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని యశస్వీ జైస్వాల్ సూపర్ ఫీల్డింగ్తో విడదీసాడు.
స్టన్నింగ్ త్రోతో ఫాఫ్ డుప్లెసిస్ను రనౌట్ చేశాడు. ఆ వెంటనే గ్లేన్ మ్యాక్స్వెల్ను అశ్విన్ క్యాచ్ ఔట్ చేశాడు. రివర్స్ స్వీప్లతో చెలరేగుతున్న మ్యాక్సీకి ఉచ్చు బిగించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్(8), సుయాశ్ ప్రభుదేశాయ్(0), వానిందు హసరంగా(6), దినేశ్ కార్తీక్(16), విజయ్ కుమార్ వైషాక్(0) దారుణంగా విఫలమవడంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న ఆర్సీబీ సాధారణ స్కోర్కే పరిమితమైంది.