బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 62), గ్లేన్ మ్యాక్స్వెల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఇతర బ్యాటర్లు విఫలమవడంతో 189 పరుగుల సాధారణ స్కోర్కే పరిమితమైంది.
ఈ ఇద్దరూ కలిసి 83 బంతుల్లో 139 పరుగులు చేస్తే... ఇతర ఆటగాళ్లంతా కలిసి 37 బంతుల్లో 37 పరుగులు చేశారు. ఎక్స్ట్రాల రూపంలో 13 పరుగులు లభించాయి. ఫాఫ్-మ్యాక్సీ విధ్వంసంతో తొలి 14 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసిన ఆర్సీబీ.. చివరి 6 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 41 పరుగులు మాత్రమే చేసింది.

156 పరుగుల వద్ద నాలుగో వికెట్గా మ్యాక్స్వెల్ వెనుదిరగ్గా.. తర్వాత వచ్చిన మహిపాల్ లోమ్రోర్(8), సుయాశ్ ప్రభుదేశాయ్(0), వానిందు హసరంగా(6), దినేశ్ కార్తీక్(16), విజయ్ కుమార్ వైషాక్(0) దారుణంగా విఫలమయ్యారు. డేవిడ్ విల్లే(4 నాటౌట్) ఓ బౌండరీ బాదడంతో ఆర్సీబీ ఆ స్కోర్ అయినా చేయగలిగింది.
ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్వెల్ విధ్వంసంతో ఓ దశలో ఆర్సీబీ సునాయసంగా 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ ఆర్సీబీ, మిడిల్, లోయరార్డర్ దారుణంగా విఫలమవడంతో గౌరవ ప్రదమైన స్కోర్కే పరిమితమైంది. చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫెయిల్యూర్ ఆటగాళ్లపై అభిమానులు మండిపడుతున్నారు.
ఆర్సీబీ నలుగురు ఆటగాళ్లతోనే నడుస్తుందని, కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్వెల్, సిరాజ్లపైనే పూర్తి ఆధారపడి ఉందని కామెంట్ చేస్తున్నారు. దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని, సుయాశ్ ప్రభుదేశాయ్, మహిపాల్ లోమ్రోర్, షెబాజ్ అహ్మద్లు వీలైనంత త్వరగా క్రికెట్ను వదిలేయాలని కోరుతున్నారు. ఈ ముగ్గురికి ఫ్రాంచైజీ ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని సూచిస్తున్నారు.
ఇంత దారుణమైన జట్టును ఎక్కడా చూడలేదని, ఇలాంటి జట్టుతో ఏ కెప్టెన్ కూడా టైటిల్ గెలవలేదని కామెంట్ చేస్తున్నారు. ముందుగా ఆర్సీబీ డైరెక్టర్ బాధ్యతల నుంచి మైక్ హస్సెన్న తొలిగించాలని, చెత్త ఆటగాళ్లతో జట్టును నాశనం పట్టిస్తున్నాడని మండిపడుతున్నారు. ప్రపంచంలో ఎన్నో స్కామ్స్ జరిగాయని, ఆర్సీబీ మిడిలార్డర్ కంటే పెద్ద మోసం మరేది లేదని సెటైర్లు పేల్చుతున్నారు.