బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు మరో ఓటమి ఎదురైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ చేసిన తప్పిదం రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది.
చివరి ఓవర్లో క్రీజులో సెట్ అయిన యువ బ్యాటర్ ధృవ్ జురేల్(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్)కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా అశ్విన్ అత్యుత్సాహం ప్రదర్శించడం రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బ తీసింది. మహమ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్లో జురెల్ ఓ భారీ సిక్సర్తో పాటు క్విక్ డబుల్ తీయడంతో 13 పరుగులే వచ్చాయి.

దాంతో చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్లో ఉన్న అశ్విన్ తొలి బంతినే బౌండరీ బాదాడు. మరుసటి బంతిని హర్షల్ పటేల్ యార్కర్గా వేయగా.. అశ్విన్ మిడ్ వికెట్ దిశగా ఆడి క్విక్ డబుల్ తీసాడు. ఆర్సీబీ ఫీల్డర్ల తప్పిదంతో ధృవ్ జురెల్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
వాస్తవానికి జురెల్ డబుల్కు నిరాకరించాడు. తానే స్ట్రైకింగ్ తీసుకొని మ్యాచ్ ముగించాలనుకున్నాడు. కానీ అత్యుత్సాహంతో అశ్విన్ డబుల్ తీసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. మూడో బంతికి బౌండరీ బాదిన అశ్విన్.. నాలుగో బంతికి భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ బసిత్ రాగా.. హర్షల్ పటేల్ కట్టడిగా బౌలింగ్ చేసి సింగిల్ మాత్రమే ఇచ్చాడు.
దాంతో చివరి బంతికి 9 పరుగులు అవసరం కాగా.. ధృవ్ జురేల్ ఏం చేయలేకపోయాడు. రెండో బంతికే ధృవ్ జురేల్కు అశ్విన్ స్ట్రైకింగ్ ఇచ్చుంటే అతనికి 4 బంతులు ఆడే అవకాశం దక్కేవి. బిగ్ షాట్స్తో మ్యాచ్ను గెలిపించే ప్రయత్నం చేసేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 62), గ్లేన్ మ్యాక్స్వెల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులే చేసి ఓటమిపాలైంది. దేవదత్ పడిక్కల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 47) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లే తలో వికెట్ తీసారు.