ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఎట్టకేలకు బోణీ కొట్టింది. సొంత మైదానం వేదికగా పంజాబ్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 45), ప్రభ్సిమ్రాన్ సింగ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 25), జితేశ్ శర్మ(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో శశాంక్ సింగ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 21 నాటౌట్) ధాటిగా ఆడాడు.

ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్వెల్ రెండేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలుపొందింది.
విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. దినేశ్ కార్తీక్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 28 నాటౌట్), మహిపాల్ లోమ్రోర్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 17 నాటౌట్) సంచలన ప్రదర్శన కనబర్చారు.
శుభారంభం లేదు..
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆశించిన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(3).. రబడా బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తొలి ఓవర్లోనే కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో బెయిర్ స్టో నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన కోహ్లీ వేగంగా పరుగులు చేశాడు.
ఫాఫ్ డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్ ఔటైనా.. కోహ్లీ దూకుడుతో ఆర్సీబీ పవర్ ప్లేలో 2 వికెట్లకు 50 పరుగులు చేసింది. అనంతరం అదే జోరు కనబర్చిన కోహ్లీ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కోహ్లీ ఒక్కడే..
లక్ష్యం దిశగా సాగుతున్న ఆర్సీబీకి హర్ప్రీత్ బ్రార్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో రజత్ పటీదార్(18), గ్లేన్ మ్యాక్స్వెల్(3)లను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన అనూజ్ రావత్తో కోహ్లీ ధాటిగా ఆడాడు. అయితే హర్షల్ పటేల్ వేసిన 16వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన విరాట్ కోహ్లీ.. అదే జోరులో మరో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అనూజ్ రావత్(11)ను సామ్ కరన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్.. చెరో బౌండరీతో సామ్ కరణ్ వేసిన 11వ ఓవర్లో 11 పరుగులు రాబట్టారు.
దినేశ్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్..
అర్ష్దీప్ సింగ్ వేసిన 18వ ఓవర్లో మహిపాల్ లోమ్రోర్ 6, 4 బాది 13 పరుగులు చేశాడు. దాంతో ఆర్సీబీ విజయానికి చివరి 12 బంతుల్లో 23 పరుగులు అవసరమయ్యాయి. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీ ఓ ఫోర్, సిక్స్తో 13 పరుగులు చేయడంతో చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 10 రన్స్ అవసరమయ్యాయి. చివరి ఓవర్ తొలి రెండు బంతులను కార్తీక్ ఫోర్, సిక్స్ కొట్టి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.