కోహ్లీ ఓదార్పు..
అయితే మ్యాచ్ అనంతరం ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ను ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓదార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోహ్లీ చేసిన పనిని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆర్సీబీ కెప్టెన్ కన్నా ముందు తాను భారత్ కెప్టెన్ అనే విషయాన్ని కోహ్లీ మరిచిపోలేదని, ప్రతీ క్షణం అతను టీ20 ప్రపంచకప్ గురించే ఆలోచిస్తున్నాడనేదానికి ఇదే నిదర్శనమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మెగా టోర్నీ ముందు జట్టులోని ఏ ఆటగాడు కూడా ఒత్తిడికి గురవ్వవద్దని కోహ్లీ భావిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియో బ్యాక్ రౌండ్లో తమకు తోచి డైలాగ్స్ను పెట్టి షేర్ చేస్తున్నారు. దాంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇషాన్ కిషన్ వల్లే..
ఆర్సీబీ చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి తర్వాత ఇషాన్ కిషన్ ఏడ్చేది ఒక్కటే తక్కువ. అతని వల్లే మ్యాచ్ పోయిందనే అపరాధభావం కనిపించింది. సూపర్ ఫామ్ కనబర్చిన కెప్టెన్ రోహిత్ శర్మను గాయపర్చడం వల్లే ఇంత ఘోర పరాజయం ఎదురైందని ఇషాన్ బాధపడుతున్నట్లు కనిపించాడు. అతను కొట్టిన ఓ షాట్ నాన్స్ట్రైకర్ ఎండ్లో రోహిత్ శర్మ చేతికి బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ ఎంత భయపడ్డాడో అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఇక ఈ గాయంతోనే భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో ముంబై పేకమేడల్లా కుప్పకూలింది.

ఫన్నీ డైలాగ్స్..
ఈ ఓటమితో ఇషాంత్ దిగాలుగా కనిపించాడు. మ్యాచ్ అనంతరం అతని దగ్గరకు వెళ్లిన విరాట్.. ఇషాన్ భుజాలపై చేతులు వేసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. క్రికెట్ ఇవన్నీ సహజమని, ముందు ముందు ఇలాంటివి చాలా ఎదురువుతాయని, అన్నితట్టుకొని నిలబడాలని చెప్పాడు. అయితే ఈ వీడియోకు అభిమానులు తమదైన శైలిలో డైలాగ్స్ జోడిస్తున్నారు. 'గెలుపు ఓటములు కామన్రా పిలగా.. గిదానేకి నువ్వు ఏడిస్తే.. నేనేం చేయాల్రా'అంటూ విరాట్.. ఇషాన్ను ఓదార్చాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. ముంబైని రెండు సార్లు ఓడించడం ఇదే తొలిసారి. లీగ్లో ప్లే ఆఫ్స్లో కలుపుకొని కూడా ఇప్పటి వరకు ఆర్సీబీ చేతిలో ముంబై ఓడలేదు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56), విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) అర్ధ సెంచరీలు సాధించగా, తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 43) ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. హర్షల్ పటేల్ (4/17) 'హ్యాట్రిక్'తో చెలరేగగా... చహల్ 3, మ్యాక్స్వెల్ 2 వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications
