బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ తమ స్టార్టింగ్ ట్రబుల్ను కొనసాగించింది. గత 10 ఏళ్లుగా శుభారంభం అందుకోని ముంబై.. ఈ సీజన్ను కూడా తడబాటుతోనే ప్రారంభించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్లో టాప్-4 ఘోరంగా విఫలమవ్వగా.. తెలుగు తేజం తిలక్ వర్మ( 46 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 84 నాటౌట్) అసాధారణ పోరాటంతో 172 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తిలక్ వర్మకు తోడుగా నెహాల్ వాదెర(13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 21) రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, టోప్లీ, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్, మైఖేల్ బ్రేస్వెల్ తలో వికెట్ తీసారు.

సిరాజ్, టోప్లీ ధాటికి ముంబై పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఇషాన్ కిషన్(10)ను సిరాజ్ ఔట్ చేయగా.. మరుసటి ఓవర్లో కామెరూన్ గ్రీన్(5)ను టోప్లీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కొద్ది సేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(1)ను ఆకాశ్ దీప్ పెవిలియన్ చేర్చాడు. సిరాజ్ బౌలింగ్లో లైఫ్ వచ్చిన రోహిత్ వినియోగించుకోలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ను బ్రేస్వెల్ ఔట్ చేయడంతో ముంబై 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ను ఆదుకున్నాడు. నెహాల్ వాదేర(21)తో కలిసి ఐదో వికెట్కు 50 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ వర్మ.. ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస సిక్సర్లతో జోరు కనబర్చిన వదేరా, టీమ్ డేవిడ్ను కర్ణ్ శర్మ ఔట్ చేయగా.. హృతిక్ షోకీన్ను హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. 19వ ఓవర్లో వరుసగా ఐదు వైడ్లు వేసిన సిరాజ్.. రెండు బౌండరీలతో 16 పరుగులు సమర్ఫించుకున్నాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో తిలక్.. రెండు సిక్స్లు, బౌండరీ బాది 22 పరుగులు పిండుకున్నాడు. దాంతో ముంబై 170 పరుగుల మార్క్ను అందుకుంది.
ఫస్ట్ ఇన్నింగ్స్లోనే డ్యూ వచ్చిన నేపథ్యంలో ఈ లక్ష్యం చేధించడం ఆర్సీబీకి పెద్ద కష్టం కాకపోవచ్చు. ముంబై బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబరిస్తే తప్పా ఈ మ్యాచ్లో గెలవలేదు.