
దుబాయ్: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి ముందు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 52), దేవదూత్ పడిక్కల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 ) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 55 నాటౌట్), శివమ్ దూబే(10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 27 నాటౌట్) మెరుపులు మెరిపించారు. స్లాగ్ ఓవర్లలో బౌలర్లపై విరుచుకుపడటంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇక మూడో మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ(3) విఫలమయ్యాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు ఆరోన్ ఫించ్, దేవదూత్ పడిక్కల్ మంచి శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే లభించిన రెండు లైఫ్లను సద్వినియోగం చేసుకున్న ఫించ్.. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఓ భారీ సిక్సర్ కొట్టి టచ్లోకి వచ్చాడు. ఆ వెంటనే రాహుల్ చాహర్ వేసిన ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్స్తో రఫ్ఫాడించాడు. చాహర్ వేసిన 8 ఓవర్లో బౌండరీ, సింగిల్తో ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ సీజన్లో అతనికి ఇది ఫస్ట్ ఫిఫ్టీ కాగా.. ఐపీఎల్లో 14వది. ఆ వెంటనే బౌల్ట్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన ఫించ్.. కీరన్ పొలార్డ్ క్యాచ్తో పెవిలియన్ చేరడంతో తొలి వికెట్కు నమోదైన 81 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(3) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. క్రీజులో కుదురుకోవడానికి 11 బంతులాడిన ఆర్సీబీ కెప్టెన్.. చాహర్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి ఫార్వార్డ్ ఫీల్డర్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్తో పడిక్కల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. పాటిన్సన్ వేసిన 14వ ఓవర్లో పడిక్కల్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు.
కృనాల్ పాండ్యా వేసిన మరుసటి ఓవర్లో డివిలియర్స్ ఫోర్ కొట్టి టచ్లోకి వచ్చాడు. రన్రేట్ తగ్గకుండా ఈ జోడీ సింగిల్స్ డబుల్స్ తీస్తూ జాగ్రత్తపడింది. పొలార్డ్ బౌలింగ్లో ఫోర్ కొట్టి పడిక్కల్ రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా వేసిన 17వ ఓవర్లో డివిలియర్స్ రెండు సిక్స్లు ఒక ఫోర్తో 18 రన్స్ పిండుకున్నాడు.
ఆ వెంటనే బౌల్ట్ బౌలింగ్లో పడిక్కల్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన దూబే సాయంతో డివిలియర్స్ ధాటిగా ఆడాడు. బుమ్రా వేసిన 19 ఓవర్లో 17 రన్స్ రాగా..ఈ ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన డివిలియర్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక లాస్ట్ ఓవర్లో దూబే వరుసగా మూడు సిక్స్లు కొట్టడంతో 20 రన్స్ రావడంతో పాటు ఆర్సీబీ 201 మార్క్ను అందుకుంది.