బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని గాయాల బెడద వేధిస్తోంది. సీజన్ ప్రారంభానికి ముందే రజత్ పటీదార్, జోష్ హజెల్వుడ్, విల్ జాక్స్ గాయాలతో జట్టుకు దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ పేసర్ చేరాడు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ పేసర్ రీస్ టోప్లీ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీని ఆపే క్రమంలో అతని భుజం డిస్లోకెట్ అయినట్లు అనిపించింది.
నొప్పితో విలవిలలాడిన టోప్లీ.. బాధతో మైదానం వీడాడు. టోప్లీ గాయం తీవ్రత చూస్తుంటే అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోలుకోలేని దెబ్బపడుతోంది. ఇప్పటికే జోష్ హజెల్ వుడ్ సేవలను కోల్పోయిన ఆ జట్టుకు టోప్లీ కూడా దూరమైతే.. బౌలింగ్ విభాగం బలహీనం అవుతోంది.

కర్ణ్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని తిలక్ వర్మ ఫైన్ లెగ్ దిశగా ఆడగా.. సూపర్ డైవ్తో టోప్లీ బౌండరీని ఆపాడు. అయితే డైవ్ చేసే సమయంలో అతను భుజం నేలకు బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో టోప్లీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసి డేంజరస్ కామెరూన్ గ్రీన్(5)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫీల్డింగ్లోనూ బౌండరీలను ఆపాడు.
ఇప్పటికే విల్ జాక్స్ సీజన్ మొత్తానికి దూరం కాగా.. మైఖేల్ బ్రేస్వెల్తో ఆర్సీబీ అతని స్థానాన్ని భర్తీ చేసింది. రజత్ పటీదార్, జోష్ హజెల్ వుడ్ గాయాలతో బాధపడుతుండటంతో హాఫ్ సీజన్ వరకు దూరం కానున్నారు. ఇప్పుడు టోప్లీ కూడా ఆ జాబితాలో చేరడం ఆర్సీబీకి కష్టంగా మారింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఆర్సీబీ బౌలర్లు షాకిచ్చారు. వరుసగా వికెట్లు తీయడంతో ఇషాన్ కిషన్(10), రోహిత్ శర్మ(1), కామెరూన్ గ్రీన్(5), సూర్యకుమార్ యాదవ్(15) దారుణంగా విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో వదేరా సాయంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్తున్నాడు.