బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 61) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు.
ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో 6, 4 బాదిన కోహ్లీ.. అతని మరుసటి ఓవర్లో మరో రెండు బౌండరీలు బాది దూకుడు కనబర్చాడు. అయితే మార్క్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో విరాట్.. ఓ భారీ సిక్సర్ బాదాడు. గంటకు 148.9 కిలోమీటర్ల వేగంతో మార్క్వుడ్ వేసిన బంతిని పుల్ షాట్తో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. ఈ షాట్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.

ఈ సిక్సర్పై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. మార్క్ వుడ్ అక్కడుంది కింగ్ కోహ్లీ.. నీ పేస్ను మడిచిపెట్టుకోవాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు. ఈ ఓవర్లోనే మార్క్వుడ్ 150.3 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని వేసాడు.
ఆర్సీబీ టాప్-3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 79 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్వెల్(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.
లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. తొలి 13 ఓవర్లలో 104 పరుగులు చేసిన ఆర్సీబీ.. చివరి 7 ఓవర్లలో 108 పరుగులు చేయడం విశేషం.