బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటర్లు దుమ్మురేపారు. టాప్-3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 61), ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 79 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్వెల్(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నోబౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. వరుస బౌండరీలతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో కోహ్లీ దూకుడు కాస్త తగ్గింది. ఇక 35 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని అమిత్ మిశ్రా విడదీసాడు. విరాట్ కోహ్లీని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 96 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి గ్లేన్ మ్యాక్స్వెల్ రాగా.. డుప్లెసిస్ చెలరేగాడు. మ్యాక్సీ సైతం తనదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడటంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫాఫ్ డుప్లెసిస్.. అనంతరం మరింత ధాటిగా ఆడాడు. ఉనాద్కత్ వేసిన 18వ ఓవర్లో మ్యాక్స్వెల్ ఓ బౌండరీ బాదగా.. డుప్లెసిస్ 2 సిక్స్లో ఓ ఫోర్ బాది 23 పరుగులు పిండుకున్నాడు.
ఈ ఓవర్ రెండో బంతికి మ్యాక్సీ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద కృనాల్ పాండ్యా నేలపాలు చేశాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన మ్యాక్సీ.. 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్లో మ్యాక్సీ సిక్స్ బాది.. క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఈ ఓవర్లో 9పరుగులు మాత్రమే వచ్చాయి.