ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో మిగతా జట్లన్నీ తమ హోమ్ గ్రౌండ్స్లో విజయాలు సాధిస్తుంటే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మాత్రం ఓటమిపాలవుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీకి ఇది రెండో పరాజయం.
పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్తో పాటు పసలేని బ్యాటింగ్ ఆర్సీబీ ఓటమిని శాసించింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఇచ్చిన సునాయస క్యాచ్ను వికెట్ కీపర్ అనూజ్ రావత్ వదిలేయడం మ్యాచ్ను మలుపు తిప్పింది.

రీస్ టోప్లీ వేసిన 17వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పూరన్ ఆడిన భారీ షాట్ మిస్ టైమ్ అయ్యి స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. చాలా ఎత్తులోకి వెళ్లిన ఈ బంతిని అందుకునేందుకు వికెట్ కీపర్ అనూజ్ రావత్, యశ్ దయాల్ పరుగెత్తారు. గ్లోవ్స్ ఉన్న వికెట్ కీపర్ తాను తీసుకుంటానని చెప్పడంతో యశ్ దయాల్ వెనుకడుగు వేసాడు.
కానీ అనూజ్ రావత్ డైవ్ చేసి కూడా బంతిని అందుకోలేకపోయాడు. ఈ అవకాశంతో చెలరేగిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తం ఐదు సిక్సర్లతో 160 పరుగులకే పరిమితం కావాల్సిన లక్నోకు 183 పరుగులు లక్ష్యాన్ని అందించాడు. ఇదే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. అనూజ్ రావత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే లక్నో సాధారణ స్కోర్కే పరిమితమయ్యేది. అప్పుడు ఆర్సీబీ ఆచితూచి ఆడేది.
ఫీల్డింగ్లోనూ పూరన్ సత్తా చాటాడు. మూడు క్యాచ్లతో పాటు ఓ రనౌట్ చేసి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. మైదానంలో చురుకుగా కదులుతూ చాలా పరుగులు సేవ్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 81) విధ్వంసకర బ్యాటింగ్తో రాణించగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 40 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 33), రజత్ పటీదార్(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 29) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్(3/14) మూడు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించగా.. సిద్దార్థ్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు.