హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. గత చరిత్రను రిపీట్ చేస్తూ మరోసారి 212 పరుగుల భారీ స్కోర్ను కాపాడుకోలేకపోయింది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది.
చివరి ఓవర్లో లక్నో విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. హర్షల్ పటేల్ అద్భుత బౌలింగ్తో రెండు వికెట్లు తీసి మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు. రవి బిష్ణోయ్ క్విక్ డబుల్తో మ్యాచ్ను టై చేసినా.. లక్నో విజయానికి చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది. క్రీజులో ఆవేశ్ ఖాన్ ఉండగా.. హర్షల్ పటేల్ మన్కడింగ్ చేయడంలో విఫలమయ్యాడు.

ఆఖరి బంతి వేయక ముందే రవి బిష్ణోయ్ క్రీజును ధాటి హాఫ్ పిచ్ వరకు పరుగెత్తగా.. హర్షల్ పటేల్ వికెట్లను కొట్టడం విఫలమయ్యాడు. ఆ తర్వాత తన బౌలింగ్ యాక్షన్ పూర్తయిన తర్వాత బంతి వేయకుండా రనౌట్ చేశాడు. కానీ మన్కడింగ్ కోసం రెండు సార్లు ప్రయత్నం చేయడం నిబంధనలకు విరుద్దమని అంపైర్ సూచించడంతో హర్షల్ పటేల్ చివరి బంతి వేయాల్సి వచ్చింది.
ఆఖరి బంతిని బ్యాట్కు తాకించడంలో ఆవేశ్ ఖాన్ విఫలమైనా.. పరుగుకు ప్రయత్నించారు. ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మాత్రం బంతిని అందుకోవడంలో తడబడటంతో లక్నో విజయం లాంఛనమైంది. హర్షల్ పటేల్ మన్కడింగ్ రూపంలో ఔట్ చేసినా.. కార్తీక్ అలర్ట్గా ఉండి బంతిని సరిగ్గా అందుకొని రనౌట్ చేసినా మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసేది.
2016 టీ20 ప్రపంచకప్లో ఇదే బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోనూ టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురైంది. బంగ్లా విజయం కోసం చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో వికెట్ కీపర్ ధోనీ అద్భుతంగా బంతిని అందుకొని రనౌట్ చేశాడు. దాంతో ఆ మ్యాచ్లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
ఆర్సీబీ-లక్నో మ్యాచ్ ఫలితం నేపథ్యంలో అభిమానులు దినేశ్ కార్తీక్ కీపింగ్ను ధోనీతో పోల్చుతూ విమర్శలు గుప్పిస్తారు. 'సారీ ధోనీ భాయ్.. దినేశ్ కార్తీక్ను అనవసరంగా నీతో పోల్చాం'అని కామెంట్ చేస్తున్నారు. ఈ తరహా మ్యాచ్ల్లో ధోనీలా కీపింగ్ ఎవరూ చేయలేరని, అతనిలా ప్రశాంతంగా ఉండటం ఏ ఆటగాడి వల్ల కాదని అభిప్రాయపడుతున్నారు.