ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు మరో ఓటమి ఎదురైంది. సొంతమైదానంలో లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఆర్సీబీ.. 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్ ఆర్సీబీ ఓటమిని శాసించింది. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఆల్రౌండ్ షోతో ఆర్సీబీని ఓడించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 81) విధ్వంసకర బ్యాటింగ్తో రాణించగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 40 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

ఆర్సీబీ బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్వెల్ రెండు వికెట్లు తీయగా..టోప్లీ, యశ్ దయాల్, సిరాజ్ తలో వికెట్ తీసారు. ఆర్సీబీ బౌలర్ల పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ లక్నో సూపర్ జెయింట్స్కు కలిసొచ్చింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 33), రజత్ పటీదార్(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 29) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్(3/14) మూడు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించగా.. సిద్దార్థ్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు.