హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. కోల్కతా నైట్రైడర్స్తో బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. కోల్కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడిన ఆర్సీబీ.. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.
ఈ సీజన్ను విజయంతో ప్రారంభించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది. మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్తో గెలిచిన ఆర్సీబీ.. సీఎస్కే చేతిలో ఓడింది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్తో జరిగిన గత రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఆర్సీబీ 8 పాయింట్లతో టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఆర్సీబీ ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫామెన్స్కు ప్రధాన కారణం మిడిలార్డర్ వైఫల్యం. టీమ్ బ్యాటింగ్ మొత్తం ముగ్గురిపైనే నడుస్తోంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్ మాత్రమే గత ఏడు మ్యాచ్ల్లో జట్టు బ్యాటింగ్ బాధ్యతలు మోసారు.
ఈ ముగ్గురిలో ఫాఫ్ డుప్లెసిస్ ప్రతీ మ్యాచ్లో సత్తా చాటగా.. కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్వెల్ ఒకటి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యారు. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటి వరకు ఆడలేదు. అంచనాలున్న దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమవుతుండగా.. యువ ప్లేయర్లు షెహ్బాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, సుయాశ్ ప్రభుదేశాయ్, అనూజ్ రావత్ ఒక్కరు కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు.
దాంతో కోహ్లీ, మ్యాక్సీ, ఫాఫ్ను ఔట్ చేస్తే ఆర్సీబీ పతనాన్ని శాసించవచ్చనే విషయం ప్రత్యర్థి టీమ్స్కు అర్థమైంది. బౌలింగ్లో కూడా సిరాజ్ ఒక్కడే నిలకడగా రాణిస్తుండగా.. గత రెండు మ్యాచ్లతోనే హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే గాడిన పడ్డారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ వానిందు హసరంగా తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ బ్యాటింగ్ను బలోపేతం చేయడంపై టీమ్మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

వానిందు హసరంగా బదులు డేంజరస్ మైఖేల్ బ్రేస్వెల్ను ఆడించాలని, ఎక్స్ట్రా స్పిన్నర్గా భారత ప్లేయర్ కర్ణ్ శర్మను ఆడించాలని చెబుతున్నారు. మైఖేల్ బ్రేస్వెల్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడని, అతనికి వరుస అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కోల్కతా నైట్రైడర్స్పై ఆర్సీబీ విజయం సాధించాలంటే మైఖేల్ బ్రేస్వెల్ ఖచ్చితంగా ఆడించాలని అభిప్రాయపడుతున్నారు. జోష్ హజెల్ వుడ్ను ఆడించడం కంటే బ్యాటింగ్ లైనప్ను బలోపేతం చేయడం ముఖ్యమని చెబుతున్నారు.