బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ( 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 101 నాటౌట్) శతక్కొట్టాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది.
కోహ్లీకి తోడుగా అనూజ్ రావత్(15 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు. ఐపీఎల్లో ఏడు సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ .. క్రిస్ గేల్(6) రికార్డును బద్దలు కొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి రెండు ఓవర్లు కాస్త నిదానంగా ఆడిన ఈ జోడీ ఆ తర్వాత చెలరేగింది. మహమ్మద్ షమీ వేసిన మూడో ఓవర్లో డుప్లెసిస్ నాలుగు బౌండరీలు బాదగా.. యష్ దయాల్ వేసిన మరుసటి ఓవర్లో కోహ్లీ హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది.
అనంతరం హార్దిక్ పాండ్యా స్పిన్నర్లను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. జోరు మీద ఉన్న ఫాఫ్ డుప్లెసిస్(28)ను నూర్ అహ్మద్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 67 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ 6, 4తో జోరు కనబర్చగా.. రషీద్ ఖాన్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆ వెంటనే మహిపాల్ లోమ్రోర్(1)ను నూర్ అహ్మద్ స్టంపౌట్ చేయగా.. బ్యాటింగ్కు వచ్చిన మైఖేల్ బ్రేస్వెల్ చెలరేగాడు. మరోవైపు కోహ్లీ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుస బౌండరీలతో జోరు కనబర్చిన బ్రేస్వెల్ను మహమ్మద్ షమీ రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే దినేశ్ కార్తీక్ గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో ఆర్సీబీ 133 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అనూజ్ రావత్తో కలిసి కోహ్లీ పోరాడాడు. యశ్ దయాల్ వేసిన 18వ ఓవర్లో 6, 4 బాదిన కోహ్లీ.. షమీ వేసిన 19వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో సింగిల్ తీసి 60 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా రెండో శతకాన్ని అందుకున్నాడు. చివరి ఓవర్లో అనూజ్ రావత్ 6, 4 బాదడంతో ఆర్సీబీ 197 పరుగులు చేసింది.